Mathu Vadalara 2 Comedian Satya : ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు 'మత్తు వదలరా 2'. ఇందుకు కారణం ఒకరకంగా కమెడియన్ సత్య అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం 'మత్తు వదలరా' సీక్వెల్తో ఆయన సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే తెగ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పగలబడి నవ్వించేలా ఆయన పేల్చిన లైనర్స్, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఒకదాన్ని మించి మరొకటి తెగ చక్కిలిగింతలు పెట్టిస్తున్నాయని సినీ ప్రియులు అంటున్నారు.
Comedian Satya Background :ఈ నేపథ్యంలో సత్య అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? కెరీర్ పరంగా ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు ఆయనలోని నటుడిని మొదటగా గుర్తించింది ఎవరు? సహా పలు విషయాలను తెలుసుకుందాం. వీటికి సమాధానాలను సత్యనే స్వయంగా గతంలో ఓ సందర్భంలో సమాధానం ఇచ్చారు.
అద్దాలు తుడిచా -దర్శకులు కె.విశ్వనాథ్, శంకర్, సుకుమార్ అంటే తనకు స్ఫూర్తి అని చెప్పారు సత్య. వాళ్ల సినిమాల్నే ఎక్కువగా చూసేవారట. దీంతో అప్పుడే తాను కూడా దర్శకుడు కావాలని అనుకున్నారట. అలా ఆ సమయంలో ఇంజినీరింగ్ మధ్యలోనే మానేసి హైదరాబాద్కు వచ్చిన సత్య కొంత కాలం కష్టపడినట్లు చెప్పుకొచ్చారు సత్య.
" మా నాన్న రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. అయితే నా దగ్గర డబ్బులు తగ్గుతున్న కొద్ది కంగారు పడ్డాను. అప్పటికీ నాంపల్లిలో ఒక హాస్పిటల్ దగ్గర అద్దాలు తుడిచే పనికి ఒప్పుకున్నాను. రోజుకి రూ.200 ఇచ్చేవారు. అయితే నాలుగు రోజులు ఆ పని చేసుంటాను." అని చెప్పుకొచ్చారు సత్య.
మూడు రోజులు మంచినీళ్లు తాగే! - "ఓ సారి రజనీ కాంత్ 'శివాజీ' సినిమా ట్రైలర్ చూపిస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్రోడ్స్లో 'భూ కైలాస్' సినిమాకు వెళ్లాను. అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. వారు రూ.500 తీసుకొని షూటింగ్ జరుగుతున్న చోటుకు పంపించారు. అక్కడే జూనియర్ ఆర్టిస్టుల మధ్య కూర్చుని షూటింగ్ను చూశాను. అక్కడే మరి కొంతమంది పరిచయం అయ్యారు. వారితో 'నవ వసంతం', 'యమదొంగ' సినిమాల షూటింగ్లకు వెళ్లాను. అయితే జూనియర్ ఆర్టిస్టుల్లోనే ఒకరు నా దగ్గరున్న డబ్బును తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో మూడు రోజులు పాటు మంచినీళ్లు తాగి మాత్రమే పడుకున్నాను.