Will Govt Reduce Import Tax On Gold Bars In Budget :కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారత్లో బంగారం దిగుమతులపై విధిస్తున్న 12.5 శాతం పన్నును 4 శాతానికి తగ్గించాలని గోల్డ్ ట్రేడర్స్ కోరుతున్నారు. దీనివల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గుతుందని, చట్టబద్ధంగా జరిగే పసిడి వ్యాపారం మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారుగా రూ.63,000 వరకు ఉంది. ఇతర దేశాలతో పోల్చితే ఈ ధర చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. పసిడి ధర ఇంత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, భారతదేశంలో బంగారంపై 12.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు. దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ, 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ సెస్ విధిస్తున్నారు. అంటే బంగారంపై మొత్తంగా 18 శాతం వరకు పన్ను వసూలు చేస్తున్నారు. ఈ పన్నుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే స్మగ్లింగ్ చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం, ఏటా దేశంలోకి 100 నుంచి 120 టన్నుల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. దీని వల్ల బంగారం రిటైల్ అమ్మకాలు భారీగా దెబ్బతింటున్నాయి.
పన్నులు తగ్గించాల్సిందే!
త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. కనుక బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో గోల్డ్ స్మగ్లింగ్ను అరికట్టకపోతే, దేశంలో బంగారం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రస్తుతం బంగారం దిగుమతులపై విధిస్తున్న 12.5 శాతం సుంకాన్ని ఏకంగా 4 శాతానికి తగ్గించాలని గోల్డ్ ట్రేడర్స్ కోరుతున్నారు.
"బంగారు ఆభరణాలపై హాల్మార్క్ వేయడం, జీఎస్టీ విధించడం లాంటి సంస్కరణల వల్ల, దేశంలో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ రిటైల్ వ్యాపారం మరింతగా అభివృద్ది చెందాలంటే, బంగారం దిగుమతులపై విధిస్తున్న సుంకాలను బాగా తగ్గించాల్సి ఉంటుంది. లేకుంటే ఇది పరోక్షంగా బంగారం అక్రమ రవాణాకు, గ్రేమార్కెట్ లావాదేవీలు పెరగడానికి కారణమవుతుంది."
- ఎం.పీ. అహ్మద్, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఛైర్మన్
పారదర్శకత పెరగాలి!
'ప్రభుత్వం దేశంలో అక్రమ పద్ధతుల్లో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. లెక్కల్లోకి రాని పసిడి వ్యాపారాన్ని నియంత్రించాలి. దీనికోసం సమర్థవంతమైన పన్ను విధానాలను బడ్జెట్లో ప్రతిపాదించాలి. తద్వారా బంగారం వ్యాపారంలో పారదర్శక విధానాలను తీసుకురావాలి. అలాగే వ్యవస్థీకృత బంగారు ఆభరణాల వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగిన విధివిధానాలను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి' అని ఎం.పీ. అహ్మద్ అభిప్రాయపడ్డారు.
మౌలిక వసతుల కల్పన
'కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాల తయారీకి కావాల్సిన మౌలిక వసతులు, ముడిపదార్థాలు చాలా తక్కువ ధరకే లభించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అంతర్జాతీయ బంగారు సరఫరాదారులు, మన దేశంలోని ఆభరణాల తయారీదారులకు సరసమైన ధరలకే ముడిపదార్థాలు అందించడానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలి. ముఖ్యంగా గోల్డ్ లోన్స్ కల్పించాలి. దీని ద్వారా దేశంలో పోటీతత్వం పెరిగి గోల్డ్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది.' అని ఎం.పీ అహ్మద్ పేర్కొన్నారు.