Supreme Court On Patanjali Products :జబ్బులను నయం చేస్తాయంటూ పతంజలి ఆయుర్వేద మందులపైచేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని, ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని, ఉత్పత్తుల బ్రాండింగ్ను నిలిపేయాలని ప్రముఖ యోగా గురు రామేదేవ్ బాబా సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పతంజలి ఉత్పత్తులపై, వాటి చికిత్స సామర్థ్యంపై ప్రచారం చేయబోమని కోర్టుకు ఆ సంస్థ ఇచ్చిన హామీ ఉల్లంఘనపై ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది.
'చర్యలు ఎందుకు తీసుకోకూడదు?'
ఈ విషయంలో కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కంపెనీ తయారుచేసిన ఆయుర్వేద మందులు జబ్బులను తగ్గిస్తాయని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ప్రచార ప్రకటనలు ఇవ్వొద్దని గత ఏడాది నవంబరు 21న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారం చేసిన పతంజలి సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రచారాలను నిలిపివేయాలని ఆదేశాలు
తమ మందులు జబ్బులను తగ్గిస్తాయని పతంజలి సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని అడ్డుకోవాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రచారాలను నిలిపివేయాలని ఆదేశించింది. సమాధానం దాఖలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని పతంజలి తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 19కి వాయిదా వేసింది.