Real Estate Growing Popularity In Rangareddy : సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరి చూపు భూములు, స్థలాల పెట్టుబడివైపే. ఎక్కువ మంది ప్రశాంత వాతావరణంలో నివాసం ఏర్పర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులు, మధ్య తరగతి, సంపన్న వర్గాల వారంతా తమ నివాసాలను నగర శివారు అవుటర్ రింగ్ రోడ్డు మొదలు, రానున్న ట్రిపుల్ ఆర్ మార్గాలకు మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు.
భారీ ప్రాజెక్టులు : అభివృద్ధి చెందతున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సమీప నియోజకవర్గాల్లోని ప్రాంతాలపై అందరి దృష్టి మళ్లుతోంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం, పిగ్లిపూర్, మజీద్పూర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ రహదారికి అటు, ఇటు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో స్థిరాస్తి సంస్థలు కూడా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి.
ప్రాజెక్టులో రోడ్లతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం : చౌటుప్పల్ వరకు విల్లా ప్రాజెక్టులు, ఇంటి స్థలాల విక్రయాలకు భారీ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో పచ్చదనం, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, ఫుట్పాత్లు, భద్రతాపరంగా చుట్టూ ప్రహరీల ఏర్పాటు ఇలా ఒకటేమిటి కలల గృహం సిద్ధమైతే నివాసం ఉండేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఇళ్ల స్థలాలను సైతం అదే స్థాయిలో అభివృద్ధి చేసి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ థీమ్లతో ప్రాజెక్ట్లు చేపడుతున్నారు.
ట్రిపుల్ ఆర్ నిర్మాణం : ప్రభుత్వం రాష్ట్రానికి మరో మణిహారంలా తీర్చిదిద్దాలని భావిస్తున్న ట్రిపుల్ఆర్ నిర్మాణం పూర్తైతే శివారు ప్రాంతాల రూపురేఖలు మారుతాయి. చాాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన స్థిరాస్తుల కోసం చూస్తున్నారు. మార్కెట్ స్తబ్దుగా ఉండటంతో ఇటీవల కాలంలో స్థలాల ధరలు దిగి వచ్చాయి. కొనేవారికి ఇది అనువైన సమయమని డెవలపర్లు అంటున్నారు.
సిటీలోని శివార్ల అభివృద్ధి
- రంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. పైవంతెనల నిర్మాణం పూరైతే వేగంగా సిటీకి చేరుకోవచ్చు.
- మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు రెండోదశలో విస్తరించబోతున్నారు. ఐదేళ్లలో పూర్తి చేయాలనేది ప్రణాళిక. దీంతో అతి తక్కువ సమయంలోనే ట్రాఫిక్ లేకుండా ప్రయాణం చేయవచ్చు.
- చౌటుప్పల్ వరకు ఆర్టీసీ సబర్బన్ బస్సు సర్వీసులను నడుపుతోంది. సిటీకి రవాణా సౌకర్యం ఉంది.
- ఈ ప్రాంతంలో పేరున్న పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. రామోజీ ఫిల్మ్సిటీ వంటి వినోద కేంద్రం ఉంది.
- ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ పార్క్లతో ఉపాధి పరంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టింది. దీంతో సిటీ నుంచి ఈ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు పెరిగారు. ఇప్పుడు సిటీలో ఉంటూ శివార్లకు వస్తున్నారు. మున్ముందు వీరంతా ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు రియాల్టీ అవకాశం కల్పిస్తోంది.
భూమి ధరలు : అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువ గజానికి రూ.2,100 (జాతీయ రహదారి వెంట గజం రూ.7100 రిజిస్ట్రేషన్ విలువ) ఉండగా బహిరంగ మార్కెట్లో, హెచ్ఎండీఏ లేఅవుట్లలో గజం రూ.10 వేల నుంచి రూ.30 వరకు ఉన్నాయి. ఆయా లేఅవుట్లలో సౌకర్యాలు, జాతీయ రహదారికి సమీపంలో ఉంటే అధిక ధరకు విక్రయాలు జరుగుతుండగా, కొద్దిగా దూరంలో ఉన్న గ్రామాల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి.
- ఇనాంగూడ, లష్కర్గూడ, బాటసింగారం గ్రామాల పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లలో గజం రూ.20-25 వేలు.
- పిగ్లిపూర్ పరిధిలో హెచ్ఎండీఏ లేఅవుట్లలో రూ.15-18 వేలు
- కవాడిపల్లి గ్రామ పంచాయతీలో రూ.22-28 వేల మధ్య విక్రయాలు జరుగుతున్నాయి.
- గుంతపల్లి, మజీద్పూర్ గ్రామాల్లోని లేఅవుట్లలో రూ.10-15 వేల వరకు అమ్ముతున్నారు.
- గేటెడ్ కమ్యూనిటీ, విల్లా ప్రాజెక్టుల్లో గజం రూ.22 వేల నుంచి రూ.32 వేల వరకు స్థలానికి, నిర్మాణ వ్యయం సామగ్రి ధరలకు అనుగుణంగా నిర్ధారిస్తున్నారు.
పాత ఇళ్లతో ఏటా రూ.8.2 కోట్ల ఆదాయం- జపాన్ యువకుడి 'రియల్' స్ట్రాటజీ ఇదే!
ఆ 3 గ్రామాల పరిధిలోనే 'ఫోర్త్ సిటీ' - రియల్ ఎస్టేట్ రంగానికి బంగారు బాటలు!