Srikala Reddy Loksabha Polls 2024 : ఉత్తర్ప్రదేశ్ లోక్సభ ఎన్నికల బరిలో ఓ తెలుగు వనిత పోటీ చేస్తున్నారు. ఆమె పేరే శ్రీకళారెడ్డి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున జౌన్పూర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. జౌన్పుర్ పరిధిలో శ్రీకళారెడ్డికి బలం, బలగం అన్నీ ఆమె భర్తే. శ్రీకళారెడ్డి భర్త పేరు ధనంజయ్ సింగ్. ఆయన మాజీ ఎంపీ. స్థానికంగా బాహుబలి నేతగా, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సన్నిహితుడిగా ధనంజయ్ సింగ్కు పేరుంది.
కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు బ్యాన్ విధించింది. దీంతో జౌన్పుర్ లోక్సభ టికెట్ను ధనంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డికి మాయావతి కేటాయించారు. శ్రీకళా రెడ్డికి బీఎస్పీ టికెట్ దక్కడం వల్ల జౌన్పుర్ లోక్సభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్ కుష్వాహా బరిలోకి దిగారు.
తెలంగాణ టు యూపీ
ఇద్దరు మాజీ మంత్రులను ఢీకొనే సత్తా శ్రీకళారెడ్డికి ఉందా? అంటే ఉందని చెప్పొచ్చు. ఆమె తండ్రి దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత జితేందర్ రెడ్డి. నిప్పో బ్యాటరీల కంపెనీ వీరి కుటుంబానిదే. జితేందర్ రెడ్డి తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. నిప్పో బ్యాటరీస్ వ్యాపారాన్ని వీరి కుటుంబం మొదటి నుంచి చెన్నై కేంద్రంగానే నడుపుతుంటుంది.
అందుకే శ్రీకళారెడ్డి బాల్యం కూడా చెన్నైలోనే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా, బీకామ్ కోర్సు హైదరాబాద్లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.