తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 7:31 AM IST

Updated : Jun 21, 2024, 9:27 AM IST

ETV Bharat / bharat

మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం - international yoga day

International Yoga Day : దేశవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు ఒడ్డునున్న షేర్‌-ఏ-కశ్మీర్‌ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వర్షం పడడం వల్ల కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది.

international yoga day
international yoga day (ANI)

International Yoga Day : యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్ -ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 50 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్న మోదీ, విదేశాల్లో యోగా చేసే వారిసంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఒక్క జర్మనీలోనే నిత్యం కోటిమందికి పైగా యోగా చేస్తున్నారని వివరించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని గుర్తుచేశారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం దక్కిందన్న మోదీ, భారత్‌లోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు. కోట్ల మందికి యోగా అనేది దైనందిన కార్యక్రమమైందని వివరించారు. ధ్యానంతో ఏకాగ్రత, యోగాతో అపారశక్తి కలుగుతాయన్నారు.

"గత 10 ఏళ్లలో యోగా విస్తరించిన తీరు యోగాకు సంబంధించిన అవగాహనను మార్చింది. నేడు, ప్రపంచం కొత్త యోగా ఆర్థిక వ్యవస్థను చూస్తోంది. భారతదేశంలో, రిషికేశ్, కాశీ నుంచి కేరళ వరకు యోగా పర్యాటకానికి సంబంధించిన కొత్త వాణిజ్యం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భారతదేశంలో ప్రామాణికమైన యోగా నేర్చుకోవాలని కోరుకునేందుకు భారతదేశానికి వస్తున్నారు. ప్రజలు తమ ఫిట్‌నెస్ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను నియమించుకుంటున్నారు. సంస్థలు కూడా ఉద్యోగుల కోసం యోగా ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ యువతకు కొత్త అవకాశాలను, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయి." అని మోదీ చెప్పారు.

యోగాసనాలు వేసిన కేంద్రమంత్రులు
దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగాగురు రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు. ఆ కార్యక్రమానికి చిన్నారులతో పాటు పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి యోగా చేశారు. దిల్లీలో కేంద్రమంత్రులు బీఎల్‌ వర్మ, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్‌ రిజిజు, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా తదితరులు 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని యోగాసనాలు వేసి జరుపుకొన్నారు.

యుద్ధనౌకపై యోగా
దిల్లీలోని కరియప్ప పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆర్మీచీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సైనిక సిబ్బందితో కలిసి యోగా చేశారు. ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠితో పాటు పలువురు నావికాదళ అధికారులు యోగాసనాలు వేశారు. సముద్రంలో INS విక్రమాదిత్య యుద్ధనౌకపై నావికాదళ కుటుంబీకులతో పాటు పలువురు ఔత్సాహికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

మంచుకొండల్లో సైనికుల ఆసనాలు
ఎప్పటిలాగే ఈసారి యోగాదినోత్సవాన్ని సైనికులు ఘనంగా నిర్వహించారు. నార్తన్‌ ఫ్రాంటియర్‌ మంచుకొండలు, ఈస్టర్న్‌ లద్దాఖ్‌ వంటి ప్రతికూల ప్రాంతాల్లో సైనికులు చేసిన యోగాను సైనిక వర్గాలు పోస్టు చేశాయి. లేహ్‌లోని వాంగ్‌చుక్‌ స్టేడియంలో సైనిక సిబ్బంది సామూహిక యోగాసనాలు వేశారు. ఆ దృశ్యాల్లో ప్రకృతి అత్యంత అందంగా, ప్రశాంతంగా దర్శనమిచ్చింది. R.S పొరా సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు యోగా చేయగా, ప్యాంగ్‌సొంగ్‌ లేక్‌ ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు ఔరా అనిపించాయి.

టైం స్క్వేర్‌ వద్ద యోగా
ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. న్యూయార్క్‌లోని టైం స్క్వేర్‌ వద్ద ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్లు యోగా డే జరుపుకొన్నారు. వందల సంఖ్యలో తరలివచ్చి ప్రాణాయామాలతో పాటు యోగాసనాలు వేశారు.

Last Updated : Jun 21, 2024, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details