తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 గంటల్లోనే బెయిలా? పుణె కారు ప్రమాదంపై బాధిత కుటుంబాలు ఫైర్​! మైనర్​ తండ్రి సహా నలుగురు అరెస్ట్ - Pune Car Accident Case

Pune Car Accident Case : పుణె రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖరీదైన కారులో వచ్చి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల ఉసురు తీసిన మైనర్‌కు ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్‌ రావడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ప్రమాదం కాదని, హత్య అని కన్నీరు మున్నీరవుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే బాలుడి తండ్రిని అరెస్ట్‌ చేసి విచారణను పుణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ పుణేలో ఆందోళనలు జరుగుతున్నాయి.

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 11:05 AM IST

Pune Car Accident Case
Pune Car Accident Case (ANI)

Pune Car Accident Case : రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో మైనర్‌ చేసిన ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపుతోంది. మైనర్‌ దురుసు డ్రైవింగ్‌ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అతిగా మద్యం తాగి 200 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకొచ్చిన మైనర్‌, బైక్‌పై వెళ్తున్న టెకీలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్‌, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మైనర్‌ చేసిన తప్పునకు ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు కన్నుమూయడం తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అయితే ఈ కేసులో మైనర్‌కు కోర్టు కేవలం 15 గంటల్లోనే బెయిల్‌ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బాధిత కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అనీశ్‌, అశ్విని మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మైనర్‌కు విధించిన బెయిల్ షరతులు తమను తీవ్రంగా బాధించాయని తాము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తామని బాధిత కుటుంబాలు తెలిపాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా నిందితుడికి 15 గంటల్లో బెయిల్ రావడంపై బాధిత కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.

కారు ఇచ్చినందుకే అరెస్ట్
అయితే నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా, న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్‌ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. తమ అభ్యర్థనను పరిగణించాల్సిందిగా సెషన్‌ కోర్టును ఆశ్రయిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మైనరైన తన కుమారుడికి కారు ఇచ్చిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం రోజు రాత్రి మైనర్‌కు మద్యం అమ్మిన బార్ ఓనర్, మేనేజర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జువైనల్ జస్టిస్ యాక్టు కింద నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

'ప్రమాదంపై వ్యాసం రాయాలి'
పుణెలో ఆదివారం ఓ లగ్జరీ కారు బైక్‌ను ఢీకొట్టడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 12వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి మైనర్‌ బాలుడు బార్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం తాగి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదని తెలిసింది. కారు డ్రైవ్ చేసిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో బాలుడు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైక్​ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఈ కేసులో బాలుడికి బెయిల్ మంజూరు చేసిన జువైనల్ కోర్టు ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్ లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. దీంతో బెయిల్‌ మంజూరు, ఈ నిబంధనలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మాలీవాల్ కేసు దర్యాప్తు కోసం సిట్- 'అప్పుడు లేడీ సింగం- ఇప్పుడేమో బీజేపీ ఏజెంటా?'- ఆప్​పై స్వాతి ఫైర్ - Swati Maliwal Assault Case

ఎమోషనల్​గా ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ- ఇండియా కూటమిదే పీఠం!: ఖర్గే - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details