తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ బ్రాండ్​ కారంలో పురుగు మందు అవశేషాలు- ప్యాకెట్లన్నీ వాపస్ తీసుకుంటున్న కంపెనీ - PATANJALI FOODS RECALLS

4 టన్నుల కారంపొడిని వెనక్కు తీసుకుంటున్న పతంజలి ఫుడ్స్- ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలతో కీలక నిర్ణయం- క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉండడమే కారణం!

red chilli powder
red chilli powder (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 4:49 PM IST

Patanjali Foods Recalls :భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఆదేశాల మేరకు పతంజలి ఫుడ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాచ్ నంబర్ ఏజేడీ2400012 కలిగిన 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను(200 గ్రాములవి) మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తోంది. ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నందు వల్లే ఆ కారం పొడిని వెనక్కి తీసుకోవాలని పతంజలి ఫుడ్స్‌కు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది. ఈమేరకు వివరాలతో పతంజలి ఫుడ్స్ సీఈఓ సంజీవ్ ఆస్థానా ఓ ప్రకటన విడుదల చేశారు. "మేం మార్కెట్ నుంచి 4 టన్నుల కారం పొడిని వెనక్కు తీసుకుంటున్నాం. అవి 200 గ్రాముల కారం పొడి ప్యాకెట్లు" అని ఆయన తెలిపారు. "ఆ ప్యాకెట్లలోని కారం పొడిని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తనిఖీ చేయగా క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది" అని పతంజలి ఫుడ్స్ సీఈఓ చెప్పారు.

వినియోగదారులకు పూర్తి రీఫండ్
"ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఆదేశాలు అందగానే మేం మా డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాం. ఆ మిర్చి పౌడర్ స్టాక్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తెప్పించుకుంటున్నాం. ఆ బ్యాచ్‌కు చెందిన కారంపొడిని కొన్న వినియోగదారులు, వెనక్కి ఇచ్చి డబ్బులు తీసుకోవాలని పేర్కొంటూ ప్రకటనలు ఇచ్చాం" అని సంజీవ్ ఆస్థానా వెల్లడించారు. కారం ప్యాకెట్లు కొన్నచోటే కస్టమర్లు వాటిని తిరిగి ఇచ్చి, పూర్తి డబ్బులు వాపసు తీసుకోవాలని సూచించారు.

తాము మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న కారం పొడి విలువ, మోతాదు చాలా తక్కువన్నారు. "మా కంపెనీకి మిర్చిని సరఫరా చేసే వారితో సంప్రదిస్తాం. పంట ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే మిర్చిని మాత్రమే కొనుగోలు చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

లాభాల బాటలో పతంజలి ఫుడ్స్​
యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలో 1986లో పతంజలి ఆయుర్వేద గ్రూప్ ఏర్పాటైంది. దాని పరిధిలోనే పతంజలి ఫుడ్స్ కంపెనీ పనిచేస్తుంటుంది. పతంజలి ఫుడ్స్ పాత పేరు రుచిసోయా. ఈ కంపెనీ రుచి గోల్డ్, న్యూట్రెలా, పతంజలి పేర్లతో వివిధ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. పవన విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ పతంజలి కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2024 సంవత్సరం జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ స్టాండ్ అలోన్ నికర లాభం 21 శాతం మేర పెరిగి రూ.308.97 కోట్లకు చేరింది. దాని నికర లాభం రూ.254.53 కోట్లుగా నమోదైంది. కంపెనీ రూ.8,198.52 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌కు రూ.7,845.79 కోట్ల ఆదాయం లభించింది.

ABOUT THE AUTHOR

...view details