police Arrested 3 members In Theft case : తన కుమారుడి ఎంబీబీఎస్ సీటు కోసం తండ్రి లాకర్లో దాచుకున్న రూ.30.20లక్షల సొమ్మును అంతర్రాష్ట్ర దొంగల ముఠా అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్ బోయగూడలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల వ్యవధిలో కేసును చేధించి నిందితుల నుంచి రూ.28లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మహంకాళి డివిజన్ ఏసీపీ సర్దార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం : ఓల్డ్ బోయగూడలోని దీప్ ఇంజినీరింగ్ అనే షాప్ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నారు. తన కుమారుడి వైద్య విద్య కోసమని షాప్లోని లాకర్లో రూ.30లక్షల 20వేల రూపాయలను భద్రపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు రాత్రివేళ షాప్ షెట్టర్ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లాకర్లో ఉన్నటువంటి రూ.30.20 లక్షల సొమ్మును అపహరించుకుని పారిపోయారు.
తన షాప్ లాకర్లో ఉంచుకున్న నగదు మాయమైనట్లు గుర్తించిన యజమాని దీనిపై మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. బిహార్కు చెందిన ప్రధాన నిందితుడు మురళీధర్ మోహన్ లాల్, ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్ర భాన్ పటేల్, ఉదయ్ రాజ్ సింగ్ లు గత ఐదేళ్లుగా మహారాష్ట్ర నుంచి వస్త్రాలను తీసుకువచ్చి జనరల్ బజార్లో విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
"దీపా ఇంజినీరింగ్ షాప్లో జనవరి 31 అర్ధరాత్రి 30.20లక్షల చోరీ జరిగిందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. ముగ్గురు నిందితులను పట్టుకోవడం జరిగింది. నిందితుల గురించి ఆరా తీస్తే గత 5 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. నిందితుల నుంచి రూ.28లక్షల 62వేల నగదు రికవరీ చేయడం జరిగింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం"- సర్దార్ సింగ్, మహంకాళి డివిజన్ ఏసీపీ
ఈనెల 1వ తేదీ రాత్రి సమయంలో దీప్ ఇంజనీరింగ్ కంపెనీలో చోరీ చేసేందుకు నిందితులు ఓ లాడ్జిలో ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురళీధర్ మోహన్ లాల్ కీలక సూత్రధారిగా వ్యవహరిస్తూ చంద్ర భాన్ పటేల్, ఉదయ్ రాజ్ సింగ్లతో దొంగతనం చేయించినట్లు విచారణలో వెళ్లడైందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు వారి నుంచి రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు.