IND VS ENG 2nd ODI : కటక్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్లు రాణించారు. మొదట బ్యాటింగ్కు దిగి 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ శతకాలతో దూకుడుగా ఆడారు. హ్యారీ బ్రూక్ (31), జోస్ బట్లర్ (34), ఫిల్ సాల్ట్ (26) కూడా జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించారు. భారత బౌలర్లూ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేసినప్పటికీ భారీ స్కోర్తో చెలరేగిపోయారు. రవీంద్ర జడేజా (3/35) అద్భుతంగా ఆడాడు. వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, చెరో వికెట్ పడగొట్టారు.
ఓపెనింగ్ అదిరింది
ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, డకెట్ ఇంగ్లీష్ జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్ సమయానికి ఈ ద్వయం 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ ఇద్దరూ నిలకడగా ఆడటం వల్ల ఇంగ్లాండ్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు స్కోర్ చేయగలిగింది. కానీ వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్ను ఔట్ చేసి భారత్ ఖాతాలో తొలి వికెట్ను అందించాడు. వరుణ్ వేసిన 10.5 ఓవర్కు జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడుసాల్ట్.
మరోవైపు దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్ను జడేజా తన తొలి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టించాడు. జడ్డూ వేసిన 15.5 ఓవర్కు డకెట్ భారీ షాట్ ఆడి లాంగాన్లో హార్దిక్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రూట్, బ్రూక్ జోడీ జట్టును ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంది. ఈ ఇద్దరూ భారత స్పిన్నర్ల బౌలింగ్లో నిలకడగా ఆడారు. ప్రమాదరకరంగా మారిన ఈ జోడీని హర్షిత్ రాణా విడదీశాడు. బ్రూక్ భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. శుభ్మన్ గిల్ ఎలాంటి తడబాటు లేకుండా బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేస్తూ సూపర్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
ఆఖరిలో అలా
ప్లేయర్లందరూ ఒక్కొక్కరిగా ఔట్ అవుతున్న తరుణంలో జోస్ బట్లర్తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దీంతో ఇంగ్లాండ్ ఈజీగా 320కుపైగా స్కోరు చేసేలా కనిపించింది. అయితే వేగం పుంజుకున్న టీమ్ఇండియా బౌలర్లు పొదుపుగా బంతులు వేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ వేసిన 38.4 ఓవర్కు బట్లర్ మిడాఫ్లో శుభ్మన్ చేతికి చిక్కగా, ఆ తర్వాత జడ్డూ బౌలింగ్లో జో రూట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఒవర్టన్ (6)ను కూడా జడ్డూనే పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ఈ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, లియామ్ లివింగ్స్టోన్ (41), అదిల్ రషీద్ (14) ఆఖరిలో వచ్చి దూకుడుగా ఆడారు. షమీని టార్గెట్ చేస్తూ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు రషీద్. అలా చివరి నాలుగు ఓవర్లలో 43 పరుగులను స్కోర్ చేశారు. అయితే ఆఖరి మూడు వికెట్లు కూడా రనౌట్గానే నమోదయ్యాయి.
మ్యాచ్ కోసం పెళ్లి వాయిదా వేసిన స్టార్ క్రికెటర్ - అయినా నిరాశ తప్పలేదుగా!
14 ఏళ్ల తర్వాత లంక గడ్డపై ఆసీస్ గెలుపు - సిరీస్ క్లీన్ స్వీప్!