Two Wheeler Thieves Arrested : హైదరాబాద్ నగరంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల జనవరి 23న మహేశ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ద్విచక్రవాహనం చోరీకి గురైందని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహేశ్ తన ద్విచక్ర వాహనం సుజుకి యాక్సెంచర్ను అవసరాల నిమిత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు.
టెస్ట్డ్రైవ్ అని ఉడాయించారు : ఓఎల్ఎక్స్లో యాడ్ చూసి రమేశ్ అనే వ్యక్తి మహేశ్కు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం ఆటోలో స్కూటీని చూడడానికి రమేశ్ బాబు, గుండప్ప, నర్సింహా ముగ్గురు వెళ్లారు. అనంతరం ముగ్గురు నిందితులు మహేశ్ను నమ్మించి టెస్ట్డ్రైవ్ చేస్తామని వెళ్లారు. ఎంత సేపు ఎదురుచూసిన మళ్లీ తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని, తన వాహనాన్ని దొంగిలించారని నిర్దారణకు వచ్చిన మహేశ్ సమీపంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలోని ఆధారాలను పరిశీలించారు.
రిమాండ్కు తరలింపు : వాటిలో పోలీసులకో ఓ ఆధారం దొరికింది. మరింత దర్యాప్తు చేసి నిందితులైన రమేశ్ బాబు(27), గుండప్ప(24)లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు నర్సింహ పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురిపైనా గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను అమ్మేసి డబ్బులను ముగ్గురు పంచుకున్నట్లు చెప్పారు. వీరి నుంచి దాదాపుగా రూ.4లక్షల విలువైన 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో 3, జగద్గిరుగుట్ట, మియాపూర్, కేపీహెచ్బీలో ఒక్కోటి చొప్పున ఉన్నాయని చెప్పారు.
రూ.లక్షలు పెట్టి కొన్న బైక్ - ఈ చిన్న ఖర్చుతో దొంగల నుంచి కాపాడుకుందాం
పార్క్ చేసిన బైక్ నుంచి 5లక్షలు ఎంత సింపుల్గా కొట్టేశాడో చూడండి