Kerala Man Won Lottery : కేరళకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అబుదాబిలో అతడు కొన్న లాటరీ టికెట్కు రూ.59.29 కోట్ల(25 మిలియన్ల దిర్హమ్) జాక్ పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడైపోయాడు.
అసలేం జరిగిందంటే?
కోజికోడ్లోని నారిపట్టాకు చెందిన ఆషిక్ పదింజరత్ (39) షార్జాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం అబుదాబిలో తీసిన లాటరీ 271వ డ్రాలో అతడు విజేతగా నిలిచాడు. దీంతో అతడి రూ.59.29కోట్ల జాక్ పాట్ దక్కింది. ఈ క్రమంలో ఆషిక్, అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఈ లాటరీ మొత్తానికి ట్యాక్స్ కూడా ఉండకపోవడం గమనార్హం. అయితే ఆషిక్ కొన్న వందో లాటరీ టికెట్కు అదృష్టం వరించింది.
"గత 19ఏళ్లుగా ఆషిక్ యూఏఈలో నివసిస్తున్నాడు. గత పదేళ్లుగా లాటరీ టికెట్లను కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లాటరీ గెలిచే వరకు టికెట్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. చివరకు ఆషిక్ జాక్పాట్ కొట్టాడు." అని ఆషిక్ తండ్రి అహ్మద్ తెలిపారు.
ఆషిక్ తన కుటుంబ సభ్యులకు తనకు లాటరీ తగలిందని బుధవారం రాత్రి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం వల్ల వారందరూ సంతోషపడ్డారు. కాగా, ఈ ఏడాది డ్రాలో ఆషిక్ ఆరు టిక్కెట్లు కొన్నాడు. అందులో ఓ టికెట్ను 1,000 దిర్హామ్స్కు కొనుగోలు చేశాడు. జనవరి 29న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 456808. ఇదే ఆషిక్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ టికెట్కే లాటరీ తగిలింది.
క్రిస్మస్- న్యూ ఇయర్ బంపర్ లాటరీ
మరోవైపుకేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రిస్మస్- న్యూ ఇయర్ బంపర్ లాటరీ లక్కీ డ్రా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ లాటరీ మొదటి బహుమతి విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు మరిన్ని ప్రైజ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే రెండో బహుమతి కోటి రూపాయలు, మూడో బహుమతి రూ.10 లక్షలు, నాలుగో బహుమతి రూ. 3 లక్షలు, ఐదో బహుమతి రూ. 2 లక్షల చొప్పున లాటరీ టికెట్ కొన్న విజేతలకు లభించనుంది. ఆరో బహుమతి రూ.5000 అందుతుంది.