Kejriwal ED Arrest :ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టుతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానం నాటకీయ మలుపు తిరిగింది. ఒకప్పుడు అవినీతి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి మూడు పర్యాయాలు దిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్, ఇప్పుడు అదే అవినీతి అరోపణలతో దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఇండియా కూటమితో కలిసి దిల్లీ, హరియాణా, గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సాగుతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది. అయితే ఎన్నికల ముంగిట పార్టీ కార్యకలాపాలు, వ్యూహ రచన, అమలులో కేజ్రీవాల్ కేంద్రంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అరెస్టు ఎన్నికల్లో ఆప్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్టు, ఆయనకు విశ్వసనీయ సహాయకులు అయిన సంజయ్ సింగ్, మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ జైలులో ఉండటం, కొంత మంది నేతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల పార్టీలో అనిశ్చితి నెలకొంది.
కేజ్రీవాల్ వారసత్వం ఎవరికో!
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారిణి అయిన కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, దిల్లీ కేబినెట్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్ పేర్లు కేజ్రీ రిప్లేస్మెంట్కు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఒంటిచేత్తో పార్టీని నడిపించి దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్ని తీసుకువెళ్లారు. లోక్సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడం వల్ల వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి.