జమ్ముకశ్మీర్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 24.10% ఓటింగ్ నమోదైంది.
Published : 5 hours ago
|Updated : 11 minutes ago
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు- ప్రశాంతంగా పోలింగ్ - JK Assembly Elections Phase 2 LIVE
JK Assembly Elections Phase 2 LIVE :జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండోవిడత పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లో 26 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
LIVE FEED
ఉదయం 11 గంటల వరకు 24.10% ఓటింగ్
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గందర్బల్, బుద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు.
అమెరికా, ఈయూ సహ వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
ఉదయం 9 గంటల వరకు 10.22% ఓటింగ్
జమ్ముకశ్మీర్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.22% ఓటింగ్ నమోదైంది.
జమ్ముకశ్మీర్లో రెండో విడత పోలింగ్ జరుగుతున్నందున ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటి సారి ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద రహిత, అభివృద్ధి చెందిన జమ్ముకశ్మీర్ను సృష్టించడం కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యువతకు బంగారు భవిష్యత్, మహిళా సాధికారత, విద్య, ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రభుత్వానికి ఉత్సాహంగా ఓటు వేయాలని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. మరోవైపు దశాబ్ద కాలంగా తమ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోయిందో గుర్తుంచుకుని ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్ముకశ్మీర్ను సురక్షితంగా, మంచి భవిష్యత్ కోసం ఓటర్లు ప్రజాస్వామ్య శక్తిని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.