తెలంగాణ

telangana

వయనాడ్​ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్​ - Satellite Images Of Wayanad

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 7:14 AM IST

Satellite Images Of Wayanad Landslide : వయనాడు విలయాన్ని ఇస్రో శాటిలైట్స్​ రికార్డ్ చేశాయి. తాజాగా వాటిని ఇస్రో విడుదల చేసింది. వయనాడ్‌లోని కొండచరియలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను - ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోశాట్‌-3, ఆర్‌ఐఎస్‌ఏటీ ఉపగ్రహాలు రికార్డు చేశాయి.

ISRO Satellite Images Of Wayanad Landslide
ISRO Satellite Images Of Wayanad Landslide (ISRO Images)

Satellite Images Of Wayanad Landslide :ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోలేం. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే నష్టాన్ని నివారించగలం. అలాంటి అవకాశాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందించింది. ఈ సంస్థ రూపొందించిన ‘ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా’ 20 ఏళ్లుగా వయనాడ్‌ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా వయనాడ్‌ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది. వయనాడ్‌లోని కొండచరియలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోశాట్‌-3, ఆర్‌ఐఎస్‌ఏటీ ఉపగ్రహాలు రికార్డు చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ చిత్రాలను విశ్లేషించింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండచరియలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి. తాజాగా రికార్డ్‌ అయిన చిత్రాల ప్రకారం సముద్రమట్టానికి 1,550 మీటర్ల ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడగా, ఈ ప్రభావంతో 86 వేల చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపుళ నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా, ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి. విలయం తర్వాత రికార్డయిన 3డీ చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో విశ్లేషించింది. ల్యాండ్‌స్లైడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటి వరకు 80 వేలకు పైగా కొండచరియలు విరిగిపడిన దృశ్యాలను రికార్డు చేయగా 2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది. ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి విపత్తును గుర్తించేందుకు ఉపయోడపడుతుందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ గతంలోనే వెల్లడించిన విషయాన్ని ఇస్రో గుర్తు చేసింది.

విలయానికి ముందు జారిపడుతున్న కొండ చరియలు (ISRO)
పూర్తిగా జారిపడిన కొండ చరియలు (ISRO)

జాడ తెలియని 206 మంది :వయనాడ్‌లోని కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 206 మంది జాడ తెలియడం లేదు. మృతుల సంఖ్య 294కి చేరుకుంది. వారిలో 25 మంది పిల్లలు, 70 మంది మహిళలు ఉన్నారు. మరో 200 మందికిపైగా గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details