Himachal Pradesh Political Crisis :హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులకు కారణం ఎవరనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ను కోరారు రెబల్ ఎమ్మెల్యేలు. ఈ విషయంపై సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడి అనర్హతకు గురైన కాంగ్రెస్ ఆరుగురు ఎమ్మెల్యేలు సహా ముగ్గురు స్వతంత్రులు హితవుపలికారు. ఆత్మగౌరవం కోసం తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఓవైపు రాజీ కోసం సంప్రదింపులు చేస్తూనే, మరోవైపు గొర్రెలు, నల్లపాములంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఏంటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అసహనం
అంతేకాకుండా చండీగఢ్లో అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు హిమాచల్ భవన్లో కాకుండా ఫైవ్ స్టార్ హోటల్లో బస చేయడంపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సమాధానం చెప్పాలన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారని, ఒకచోట నుంచి మరో చోటికి గొర్రెల మాదిరిగా వెళ్తున్నారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ ఇటీవల ఓ సమావేశంలో చేసిన ప్రకటన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు ఈ విధంగా స్పందించారు.
ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీ
హిమాచల్ప్రదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉపముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి, HPCC చీఫ్ ప్రతిభా సింగ్, కాంగ్రెస్ నేతలు కౌల్ సింగ్ ఠాకూర్, ధనిరామ్ శాండిల్, రామ్ లాల్ ఠాకూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.