తెలంగాణ

telangana

హత్యాచారం చేశారని బాలిక మృతదేహానికి తల్లిదండ్రులు అంత్యక్రియలు- నెల తర్వాత ఇంటికి వచ్చిన కుమార్తె- ట్విస్ట్​ అదే! - Girl Returned Alive After Last Rite

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 12:30 PM IST

Girl Returned Alive After Last Rites : నదిలో దొరికిన గుర్తు తెలియని మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేశారు ఓ దంపతులు. తమ కుమార్తెపై హత్యాచారానికి పాల్పడి నదిలో పడేసి ఉంటారని భావించి ఇలా చేశారు. అయితే నెల రోజుల తర్వాత దంపతుల కుమార్తె ఇంటికి తిరిగొచ్చింది. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.

Girl Returned Alive After Last Rites
Girl Returned Alive After Last Rites (ETV Bharat)

Girl Returned Alive After Last Rites :తమ కుమార్తెపై దుండగులు హత్యాచారానికి పాల్పడి, చంపేశారని భావించి నదిలో లభించిన గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసేశారు బాలిక తల్లిదండ్రులు. అలాగే బాలిక చితాభస్మాన్ని గయాలోని గంగానదిలో కలిపారు. అయితే నెలరోజుల కిందట అదృశ్యమైన బాలిక ఒక్కసారిగా తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగుతున్నారు. బాలిక తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పడ్డారు పోలీసులు.

ఇదీ జరిగింది
బిహార్‌లోని మోతిహారి ప్రాంతానికి చెందిన బాలిక జూన్ 16న కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత తమ కుమార్తె కనిపించడంలేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 22న ధనౌతి నది వద్ద ఒక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేక శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత ఆ మృతదేహాం తమ కుమార్తెదేనని దంపతులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ కుమార్తెపై కొందరు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

మృతదేహం అప్పగింత
బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. దీంతో బాలిక తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. జులై 18న బాలిక చితాభస్మాన్ని గంగానదిలో కలిపారు. అలాగే నిందితుల్లో ఒకరైన గుడ్డు షాను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడు రంజన్ పాశ్వాన్ కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో తాము సామూహిక అత్యాచారానికి పాల్పడ్డామని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు. బాలిక చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని నదిలో విసిరేసి పరారయ్యామని ఒప్పుకున్నారు.

బాలిక తెలిపిన వివరాల ప్రకారం,జూన్ 16వ తేదీ రాత్రి తన ప్రియుడిని కలవడానికి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పుడు నలుగురు యువకులు బాలిక, ఆమె ప్రియుడిపై దాడి చేశారు. బలవంతంగా ఆటో రిక్షాలో బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. ఆ తర్వాత ఆమెను ఛటౌనీలో దించి వెళ్లిపోయారు. తుర్కౌలియాలో ఉన్న తన తల్లి బంధువుల ఇంటికి బస్సులో వెళ్లాలని బాలిక అనుకుంది. కానీ దారి తప్పిపోయింది. అప్పుడు బాలికకు తెలిసిన మహిళ ఒకరు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పుడు బాలిక తనపై జరిగిన లైంగిక దాడి గురించి మహిళకు చెప్పింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పవద్దని కోరింది. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మహిళ బాలిక తండ్రికి ఫోన్ చేసింది. రాంగ్ నంబర్ అని చెప్పి కాల్‌ కట్ తండ్రి చేసేశాడు. దీంతో తండ్రి తనపై ఇంకా కోపంగా ఉన్నాడని భయపడి, బాలిక ఇంటికి తిరిగి రాలేదు.

అనుమానంతో వెతుకులాట- దొరికిన ఆచూకీ
బాలిక ప్రాణాలతో ఉండవచ్చనే అనుమానంతో ఎస్ హెచ్ఓ మనీశ్ కుమార్ ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. తుర్కౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బాలిక కనిపించిందన్న సమాచారం అందింది. వెంటనే తన బృందంతో వెళ్లి బాలిక ఆచూకీని కనుగొన్నారు. బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో వాంగ్మూలం నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే, తమ కుమార్తె అదృశ్యమైన రోజు ఆమె ఎరుపు రంగు కుర్తీ ధరించిందని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. నదిలో లభించిన బాలిక మృతదేహానికి కూడా ఎరుపు రంగు కుర్తీ ఉందని, అందుకే ఆ శవాన్ని తమ కూతురు అనుకున్నామని తెలిపారు. కాగా, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. నదిలో కనిపించిన మృతదేహం ఎవరిదనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిందుతులు ఎవరిని హత్య చేసి ఉంటారనే కోణంలో విచారణ చేపట్టారు.

కర్ణాటకను షేక్​ చేస్తున్న 'ముడా' స్కామ్! చర్చకు కాంగ్రెస్ ​నో- రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రించిన విపక్ష ఎమ్మెల్యేలు - Muda Scam Protest In Karnataka

కూలీకి దొరికిన భారీ డైమండ్- రూ.250 పెట్టుబడితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా!

ABOUT THE AUTHOR

...view details