తెలంగాణ

telangana

ఆదాయంలో BRS టాప్- కేసీఆర్​ పార్టీకి రూ.680 కోట్ల ఇన్​కమ్​- మరి ఖర్చుల్లో? - Regional Parties Income Report

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 6:55 PM IST

ADR Report On Regional Parties Income : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మొదటిస్థానంలో నిలిచింది. ఆ ఏడాది బీఆర్ఎస్‌కు ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలింది. ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై పూర్తి సమాచారంతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలోని వివరాలివీ

ADR Report On Regional Parties Income
ADR Report On Regional Parties Income (Getty Images)

ADR Report On Regional Parties Income :మనదేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మొదటిస్థానంలో నిలిచింది. ఆ సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ. 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానం.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ. 333.45 కోట్ల(19.16 శాతం) ఆదాయం వచ్చింది. డీఎంకేకు రూ. 214.35 కోట్ల (12.32 శాతం) ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 39 పార్టీలు వివరణాత్మక ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్-5 స్థానాల్లో నిలిచిన పార్టీలు రూ.1,541.32 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56 శాతానికి సమానం. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం రూ.1,740.48 కోట్లు.

ఖర్చు చేయడంలో టాప్-5 పార్టీలివీ!
2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యయాల విషయానికొస్తే, అత్యధికంగా ఖర్చు చేసిన టాప్- 5 పార్టీల లిస్టులో మొదటి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ రూ.181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66 శాతానికి సమానం. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ రూ. 79.32 కోట్ల (16.49 శాతం) ఖర్చు చేసింది. మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ రూ. 57.47 కోట్లు (11.94 శాతం) ఖర్చు చేసింది. నాలుగో స్థానంలో నిలిచిన డీఎంకే రూ.52.62 కోట్లు(10.94 శాతం), ఐదో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ రూ.31.41 కోట్లు(6.53 శాతం) ఖర్చు చేసింది.

ఖర్చులుపోనూ బీఆర్ఎస్‌కు భారీ ఆదాయం
2022-23 ఆర్థిక సంవత్సరంలో 19 ప్రాంతీయ పార్టీలు ఖర్చులుపోనూ ఆదాయం మిగిలిందని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. బీఆర్ఎస్‌కు ఖర్చులుపోనూ అత్యధికంగా రూ.680.20 కోట్ల ఆదాయం మిగిలింది. బిజూ జనతాదళ్‌కు రూ.171.06 కోట్లు, డీఎంకేకు రూ.161.72 కోట్ల మేర ఈవిధమైన ఆదాయం లభించింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా 20 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని వెల్లడించాయి. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులు 490.43 శాతం ఎక్కువ ఉన్నాయని తెలిపాయి.

శివసేన శిందే వర్గం, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు సహా 18 ప్రాంతీయ పార్టీల 2022-23 ఆర్థిక సంవత్సర ఆడిట్ నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ తెలిపింది. ప్రాంతీయ రాజకీయ పార్టీలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం రూ. 1,522.46 కోట్ల ఆదాయంలో రూ.1,285.83 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించాయి. ఎనిమిది ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను స్వీకరించాయని ఏడీఆర్ వెల్లడించింది.

150 రోజులు లేట్‌గా!
రాజకీయ పార్టీలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆడిట్ చేసిన ఖాతాలను సమర్పించడానికి 2023 అక్టోబర్ 31ని కేంద్ర ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. అయితే 16 ప్రాంతీయ పార్టీలు మాత్రమే గడువులోగా ఆడిట్ రిపోర్టులను సమర్పించాయి. మిగతా 23 ప్రాంతీయ పార్టీలు తమ నివేదికలను ఆలస్యంగా సమర్పించాయి. సగటున అవి 3 రోజుల నుంచి 150 రోజులు ఆలస్యం నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాయి.

ABOUT THE AUTHOR

...view details