thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 4:59 PM IST

ETV Bharat / Videos

పింఛన్ కోసం బామ్మ పాట్లు- 2కి.మీ దూరంలోని పోస్టాఫీస్​కు వెళ్లేందుకు 8 గంటలు శ్రమ

Woman Crawling On Road For Pension : కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో పెన్షన్ కోసం ఓ వృద్ధురాలు 2 కిలోమీటర్లు దేకుతూ వెళ్లింది. 8గంటలపాటు శ్రమించి బోరున విలపిస్తూ పోస్టాఫీస్​కు చేరుకుంది. ఈ క్రమంలో వృద్ధురాలి కాళ్లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు వృద్ధురాలిని హరిహర ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.

ఇదీ జరిగింది
జిల్లాలోని నందితవెరె గ్రామానికి చెందిన గిరిజమ్మ అనే వృద్ధురాలికి గత రెండు నెలలుగా వృద్ధాప్య పింఛన్​ అందట్లేదు. అప్పుడు వృద్ధురాలు కునెబెలకెరె పోస్ట్​మ్యాన్​ను అడిగింది. అతడు గిరిజమ్మకు దురుసుగా సమాధానం చెప్పాడు. గత రెండు నెలలుగా వృద్ధురాలి పెన్షన్ డబ్బులు రావట్లేదని చెప్పాడు. తాను బతికేందుకు జీవనాధారమైన పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలు గిరిజమ్మ నందితవెరె గ్రామం నుంచి కునెబెలకెరె పోస్టాఫీస్​కు మంగళవారం ఉదయం 8గంటలకు బయలుదేరి సాయంత్రం 4గంటలకు చేరుకుంది. అప్పటికే ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఈ విషయం అధికారుల దృష్టికి చేరడం వల్ల ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

'పింఛన్‌ ఎందుకు రావడం లేదని తెలుసుకునేందుకు పోస్టాఫీస్​కు వెళ్లా. పోస్ట్‌మ్యాన్‌ను అడిగితే అతడు సరిగ్గా సమాధానం చెప్పకుండా నాపై దుర్భాషలాడాడు. ఆటోలో వెళ్లేందుకు డబ్బులు లేకపోవడం వల్ల మెల్లగా దేకుతూ పోస్టాఫీస్​కు చేరుకున్నా. నాకు పిల్లలు లేరు. నేను ఒంటరిగా జీవిస్తున్నా' అని వృద్ధురాలు తెలిపింది. 

మరోవైపు, గిరిజమ్మ తనకు పింఛన్ డబ్బులు అందలేదని కునెబెలకెరె పోస్టాఫీస్​కు వచ్చిందని ఆశా కార్యకర్త చెప్పారు. ఈ వీడియో తహసీల్దార్​ దృష్టికి చేరిందని, ఆయన గాయాలైన వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించాలని తనను ఆదేశించారని తెలిపారు.' వృద్ధురాలికి భోజనం, టిఫిన్​ ఏర్పాటు చేశాను. ఆమెకు బంధువులు, పిల్లలు లేరు. ఒంటరిగా జీవిస్తోంది. ఆమె పింఛన్ సమస్యను పరిష్కరిస్తాం' అని ఆశా కార్యకర్త తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.