Revanth Reddy Demands : 'వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకి రూ.25లక్షలు ఇవ్వాలి'
Revanth Reddy Demands to TS Government : రాష్ట్రంలోని రైతులు వర్షాలు, వరదలతో నష్టపోతుంటే ముఖ్యమంత్రి మహారాష్ట్ర పర్యటనలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. వరద సాయంపై సీఎం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. నష్టపోయిన అన్నదాతలందరినీ ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంతో కుమ్మక్కై దుర్మార్గపు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ రాష్ట్రానికి సాయం అందించకపోతే కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల మృతి చెందిన రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పరిహారంగా రూ.25 లక్షలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల వల్ల సుమారు 20 లక్షల పంట నష్టం జరిగిందని వివరించారు. ప్రతి ఎకరానికి రూ.20,000 చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఇసుక మేటలతో కోల్పోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు నాశనం అయిపోయాయని.. వాటికి తక్షణమే ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.