Response on ETV BHARAT Story : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. శవ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
Response on ETV BHARAT Story : కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.57.90 లక్షలతో శవ పరీక్ష కేంద్రం నిర్మించి పది నెలలుగా వృథాగా వదిలేయడంపై ఈనాడు-ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఆసుపత్రి పర్యవేక్షణ వైద్యుడు ఆనంద్ యాదవ్, స్థానిక సర్పంచి సురేష్, వైద్యుల బృందం, ఇతర ప్రజా ప్రతినిధులు శవ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. శవ పరీక్ష కేంద్రం నిర్మించి వృథాగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరిన పాత ఆసుపత్రి భవనం వరండాలోనే శవ పంచనామా చేస్తున్నారని వాటి ఇబ్బందులపై అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఈ నెల 14న ఈటీవీ భారత్లో మద్నూర్లో శవ పరీక్షకు తప్పని ఇక్కట్లు' కథనం ప్రసారం అయ్యింది. ఈ నెల 17న ఈనాడులో రూ.లక్షల వ్యయం...అలంకార ప్రాయం' కథనం ప్రచురితం అయ్యింది. శవ పరీక్ష ఇబ్బందులపై కథనాలు అందించిన ఈనాడు-ఈటీవీ భారత్ రిపోర్టర్ శ్రీనివాస్ గౌడ్ను వైద్యులు, ప్రజా ప్రతినిధులు సన్మానించారు.