Payyavula Keshav on Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీని తుదముట్టించడం తథ్యం: పయ్యావుల కేశవ్
Published : Oct 10, 2023, 7:26 PM IST
Payyavula Keshav on Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని.. ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాట పంథా మానవద్దని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారన్నారు. పక్క రాష్ట్రం (తెలంగాణ)లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో టీడీపీని దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆయనపై అక్రమ కేసులు పెట్టారని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు.
Payyavula Keshav Comments: రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పయ్యావుల.. పలు విషయాలను ప్రస్తావించారు. ''రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును జగన్ ముందుకు వెళ్లనీయలేదు. ప్రాజెక్టులు చేపట్టట్లేదని సమరభేరి ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు పోరాటంతో ప్రజల్లో వచ్చిన స్పందన చూసి జగన్ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతో దొడ్డిదారిన ఆయనపై కేసు పెట్టింది. సాగునీటి రంగంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు పెట్టారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ నాయకత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. కానీ, అది వారి వల్ల కాదు. 54 దేశాల తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఆయనపై అక్రమంగా కేసు పెట్టారని.. రాష్ట్ర, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. ఈ ఘటనలతో టీడీపీ మరింత దృఢంగా మారింది. మరింత బలంగా ఎన్నికల్లో టీడీపీ పోరాడుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తుదముట్టించడం తథ్యం'' అని ఆయన అన్నారు.