Rain in yadadri: యాదాద్రిలో భారీ వర్షం.. ఇబ్బందిపడిన భక్త జనం
rain in yadadri: యాదాద్రి భువనగిరిలో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడి వాతావరణమంతా వేసవి తాపాన్ని వదిలి ఒక్కసారిగా చల్లబడిపోయింది. యాదగిరిగుట్టలో గంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా.. ఉదయాన్నే నరసింహ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు ఆలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.
ఇటీవల కురిసిన వడగళ్ల వానకు రైతులు ఎంతో నష్టపోయారు. చేతికందొచ్చిన పంట మొత్తం నేలపాలైంది. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యపు రాశులు నీటి పాలయ్యాయి. వడగళ్లతో కూడిన వర్షం కురవటం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించి రైతులకు పరిహారం చెల్లించే దిశగా చూస్తోంది.