యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ - నందినగర్ నివాసానికి తీసుకెళ్లిన కేటీఆర్, హరీశ్రావు - మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ అప్ డేట్స్
🎬 Watch Now: Feature Video


Published : Dec 15, 2023, 12:33 PM IST
|Updated : Dec 15, 2023, 3:40 PM IST
Ex CM KCR Discharge From Hospital : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి కేటీఆర్, హరీశ్రావు తీసుకెళ్లారు. ప్రతి రోజు యశోద నుంచి నందినగర్ వెళ్లి కేసీఆర్కు వైద్యులు ఫిజియోథెరపీ చేయనున్నారు. వైద్యులు వారం రోజుల తరువాత మరో మారు కేసీఆర్(KCR) ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు.
అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు : తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారని ఎమ్మెల్సీ కవిత ఎక్స్(X) వేదికగా పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కష్టసమయంలో దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రేమాభిమానం దక్కిందని కవిత అన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబానికి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి పడడంతో వారం రోజుల క్రితం కేసీఆర్(KCR) ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం కేసీఆర్కు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించింది. ఆయనకు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఈ క్రమంలో ఆయనను కలవడానికి సీఎం రేవంత్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసుపత్రికి వచ్చారు.