Delhi Jewellery Shop Robbery : తుపాకీతో బెదిరించి బంగారు దుకాణంలో చోరీ.. హెల్మెట్లతో వచ్చి..
Published : Sep 29, 2023, 8:03 AM IST
|Updated : Sep 29, 2023, 10:12 AM IST
Delhi Jewellery Shop Robbery : తుపాకీతో బెదిరించి బంగారం దుకాణంలో రూ. 50 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. గన్ పాయింట్లో తుపాకీని పెట్టి బంగారం ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఇదీ జరిగింది
సమయ్పుర్ బాదలి పరిధిలోని శ్రీరామ్ జువెల్లర్స్ షాపులో బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ముగ్గురు దొంగలు హెల్మెట్లు ధరించి ప్రవేశించారు. దుకాణ సిబ్బంది, కొనుగోలుదారులు అందరూ చూస్తుండగా.. నిమిషాల్లోనే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ షాపులో దొంగతనం చేసిన తర్వాత మరో దుకాణంలోకి ప్రవేశించి.. 800 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. పట్టపగలే దుకాణాల్లోకి ప్రవేశించి.. తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారని దుకాణాదారులు చెబుతున్నారు. అంతకుముందు శుక్రవారమే ఓ జ్యువెలరీ షోరూమ్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ గోడకు రంధ్రం చేసి.. లోపలకు చొరబడి రూ.20-25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు.