యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని జక్కుల చెరువులో చుక్క నీరు లేక బోసిపోయింది. ఫలితంగా చెరువునే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న మత్స్యకారులు ఆర్థికంగా కుదేలయ్యారు. గ్రామంలో ఉపాధి కరవై పట్టణాల బాట పడుతున్నారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వలస పోతున్నారు.
గ్రామస్థుల ఇక్కట్లు..
ఓవైపు అన్ని గ్రామాల్లో కాలువలు, వర్షపు నీటి ద్వారా వచ్చిన నీటితో వాగులు, వంకలు, చెరువులు, కాల్వలు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు గొలనుకొండలోని జక్కుల చెరువు మాత్రం వాటికి భిన్నంగా ఎండిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
50 కుటుంబాలు కుదేలు
గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు, సుమారు 40 వేల రూపాయలు ఖర్చుచేసుకుని చెరువులోని కంప చెట్లను తొలగించారు. పూర్థి స్థాయిలో చెరువుకు మరమ్మతు నిర్వహించాల్సి ఉంది. గ్రామంలో సుమారు 50 మత్స్యకార కుటుంబాలున్నప్పటికీ నీటి వసతి లేక నిరుపయోగంగా మారింది. వ్యవసాయం కూడా ఇబ్బందిగానే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి వసతులు లేక బావులు ఎండిపోయాయి. తూర్పు గూడెం నుంచి గొలనుకొండలోని జక్కుల చెరువుకు నీరు రావాల్సి ఉందని... స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత , ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకోవాలని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల మధు బెస్త విజ్ఞప్తి చేశారు.
రుణ సౌకర్యాలు...
ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టుల ద్వారా జక్కుల చెరువును నింపాలని మహిళా మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు వంగాల హేమలత బెస్త కోరారు. ఆలేరు మండలంలోని చెరువులకు, కాలువల ద్వారా శారాజిపేటకు నీరు వస్తే, అకడ్నుంచి తూర్పుగూడెం గొలనుకొండ చెరువులను నింపి తమ కష్టాలను తీర్చాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మత్స్యకారులకు రుణ సౌకర్యాలు కల్పించాలని, పింఛన్లు ఇప్పించాలని మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు వంగాల భిక్షపతి బెస్త విజ్ఞప్తి చేశారు.
అధికారులూ.. చెరువు నింపండి..
జక్కుల చెరువును నింపడం ద్వారా చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగి, బోర్లు వేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా నీరు లేక వ్యవసాయ భూములను కూడా సాగు చేయలేకపోతున్నామని వాపోయారు. సకల పనులకు ఆధారమైన చెరువు నిండితేనే గ్రామస్థులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రతిపాదనలు రాగానే పనులు చేపడతామని వివరించారు.
ఇవీ చూడండి : మంత్రి ఈటల మాటలు బాధ కలిగించాయి: భట్టి విక్రమార్క