వైద్య విద్యలో మెలకువలు నేర్చుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన డాక్టర్ మర్రి సత్యనారాయణరెడ్డి సొంత గ్రామానికి ఏదో ఒక మంచి పని చేయాలని తపించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో మూడు అదనపు తరగతి గదులు నిర్మించారు.
గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.లక్ష నగదు అందించారు. నూతనకల్ మండల కేంద్రంలో ప్రస్తుతం రూ. కోటి విలువ చేసే ఏడున్నర ఎకరాల వ్యవసాయ స్థలం కొనుగోలు చేసి మినీ స్టేడియం ఏర్పాటుకు అందించి నిర్మాణం కోసం రూ.3 లక్షల నగదు అందించారు. రక్షకభట నిలయానికి సుమారు రూ.30 లక్షలు విలువ చేసే రెండెకరాల స్థలాన్ని అందించారు.
యువతే భవిత
సొంత ఊరిపై మమకారంతో తమ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న గ్రామానికి చెందిన బిక్కసాని సుబ్బారావు కుమార్తె పారుపల్లి జ్యోతి, ఆయన ఇద్దరు కుమారులు శ్రీనివాస్, మనోహర్ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు తమ తల్లి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి రూ.50 లక్షలు వెచ్చించి గ్రామంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా భవనం నిర్మిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి, ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు అందించారు.
* ఇదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నరజాల రవి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల పల్లె ప్రకృతి వనంలో వసతుల కల్పనకు రూ.25 వేలు అందించారు. దాచారం గ్రామంలో అన్నపురెడ్డి వీరారెడ్డి మెమోరియల్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి స్థలం ఉచితంగా అందివ్వడంతో పాటు, 30 శాతం కంట్రిబ్యూషన్ చెల్లించి భవనం నిర్మించడంలో ఎన్ఆర్ఐ అన్నపురెడ్డి సిద్ధార్థ కీలక భూమిక పోషించారు.
పల్లెను తలచి.. సేవలో తరించి
మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన మామిడి అలువేలు మంగ, శ్రీనివాస్రెడ్డి దుబాయ్ స్థిరపడి సొంత గ్రామాలకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలు అందిస్తున్నారు. పుట్టిన గడ్డ చాడ, ముత్తిరెడ్డిగూడెం పాఠశాలల్లో రూ.లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలకు 2017 సెప్టెంబర్లో బెంచీలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించి రామాలయాన్ని నిర్మింపజేశారు. 2019లో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ల్యాప్టాప్, ఆర్థిక సాయం అందించారు. చాడలోని వీధుల్లో ప్రస్తుతం రూ.4.5 లక్షలు వెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.
వాటిని త్వరలో వారే స్వయంగా వచ్చి ప్రారంభించనున్నారు. విద్యా రంగానికి సేవలందిస్తే సమాజ, దేశ అభివృద్ధికి తోడ్పడినట్లే నా మామిడి అలివేలు మంగ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మనిషికి నిర్మలమైన మనుస్సు కలిగి ఉండాలంటే దేవాలయానికి పూజ చేయాలని మామిడి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు