India vs England 1st ODI : ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్లోను కూడా శుభారంభం చేసింది. ఇంగ్లిష్ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి ఓడీఐలో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధశతకాలు బాదారు. కాగా, ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(2) నిరాశ పరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మహమూద్, రషీద్కు చెరో 2 వికెట్లు, ఆర్చర్, బెతెల్ తలో వికెట్ తీశారు.
249 పరుగుల సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో ఓపెనర్ యశస్వ జైస్వాల్(15) షాట్కు ప్రయత్నించి కీపర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జట్టు సారథి రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయితే వన్ డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ క్రీజులో పాతుకుపోయాడు. సెకండ్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 113 పరుగులు జోడించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. మిడిలార్డర్లో వచ్చిన రాహుల్ (2)- రషీద్ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్ చేరాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే మహమూద్ బౌలింగ్లో భారీ షాట్కు ట్రై చేసి గిల్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హార్దిక్ పాండ్య (9), రవీంద్ర జడేజా (12) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి టార్గెట్ను ఛేందించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బట్లర్ (52), బెతెల్ (51) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (43) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ సమన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డకెట్ (32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. జడేజా మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.