మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న వ్యక్తిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీసులు చేరదీసి, సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలో కొన్నేళ్లుగా బలరామ్ అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ శ్రీధర్ శుక్రవారం ఉదయం.. పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రహదారి పక్కన నిద్రిస్తున్న బలరామ్ను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అతనికి స్నానం చేయించి, కొత్త బట్టలు ఇప్పించి భోజనం పెట్టారు.
అనంతరం బంధువుల గురించి ఆరా తీయగా పోతారం గ్రామంలో అన్నదమ్ములు ఉన్నారని బలరామ్ చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి విచారించి అతని సోదరులు నారాయణ, బక్కయ్యలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి పలువురు పట్టణ ప్రజలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
ఇదీ చదవండి: రాష్ట్రాభివృద్ధిలో సాంకేతికత ప్రధానమైనది : కేటీఆర్