సంగారెడ్డి జిల్లా అందోలు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేపటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వసతి గృహం వద్దకు వెళ్లగా తాళాలు లేవని సిబ్బంది చెప్పారు. అంతేకాకుండా... ప్రిన్సిపల్, కేర్ టేకర్, అసిస్టెంట్ కేర్ టేకర్, వంట మనుషులు లేకపోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఫోన్ చేసి వివరించారు. సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పలుమార్లు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించి చెప్పినప్పటికీ... ఇలా వ్యవహరించడం కరెక్టు కాదని హితవు పలికారు. ఈ రాత్రికి ఎవరైనా విద్యార్థులు వస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ ఛైర్పర్సన్ మంజు శ్రీ, తదితరులు ఉన్నారు.