కరోనా చికిత్సకు కొత్త మందులు వచ్చేవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్న పాత ఔషధాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున మన దేశంలోనూ అత్యవసర చికిత్సలో వాడేందుకు కొన్ని పాత మందులకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
లైసెన్సింగ్ ఒప్పందంతో మన ఫార్మా కంపెనీలు ఆయా ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వీటి ధరలు అందుబాటులో ఉండేలా.. దేశీయంగా లభించే ముడి పదార్ధాలతో తయారు చేసేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) రెమిడిసివిర్, ఫెవిపిరవిర్తోపాటూ మరో రెండు ఔషధాలను అభివృద్ధి చేసింది. వీటిని పలు కంపెనీలకు బదలాయించడంతో క్రమంగా ధరలు దిగి వస్తున్నాయి. ఇలా ఎన్నో పరిశోధనలకు కేంద్రమైన ఐఐసీటీ నేడు 77వ వార్షికోత్సవం జరుపుకొంటోంది.
పునాది 1944లోనే..
ఏడున్నర దశాబ్దాలుగా దేశ పారిశ్రామిక, ఆర్థిక రంగ పురోభివృద్ధికి ఎంతో కృషిచేసిన ఐఐసీటీకి పునాది 1944లో పడింది. అప్పటి హైదరాబాద్ స్టేట్లో నిజాం ఆదేశాలతో సెంట్రల్ ల్యాబరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎల్ఎస్ఐఆర్) ఏర్పాటైంది. ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి 1949లో శంకుస్థాపన చేయగా 1954 జనవరి 2 తొలి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం చేశారు.
1956లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)లో సీఎల్ఎస్ఐఆర్ను విలీనం చేసి రీజినల్ రీసెర్చ్ ల్యాబరేటరీ(ఆర్ఆర్ఎల్)గా పేరు మార్చారు. అనంతరం 1989లో ఐఐసీటీగా మార్చారు. మొదట్లో పురుగు మందులు, బొగ్గు, సిరామిక్స్, నూనెలు, పాలిమర్స్పై పరిశోధనలు మొదలు పెట్టి క్రమంగా పరిధిని పెంచుకుంది. తర్వాత ఫార్మా, ఇంధన, ఇతర ప్రధాన రంగాలను పరిశోధనలకు విస్తరించింది.
జనరిక్ మందులపై..
పలు ఔషధాల ఖరీదు ఎక్కువ కావడంతో దేశీయంగా జనరిక్ మందుల తయారీకి కావాల్సిన సాంకేతికతను ఐఐసీటీ అభివృద్ధి చేసింది. హెచ్ఐవీ వంటి వాటికి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తక్కువ ధరకే మందులను సిద్ధం చేయడంతోపాటు ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రపంచ మార్కెట్కు అందించిన ఘనత ఉంది.
ఔషధ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు 2 వేల మూలకాల నిధిని ఏర్పాటు చేశారు. కొవిడ్-19 ప్రారంభంలో ఔషధాల ముడి సరకుల కోసం చైనాసహా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో దేశీయంగా ముడి పదార్థాల అభివృద్ధిపై ఐఐసీటీ దృష్టి పెట్టింది. స్థానికంగా దొరికే రసాయనాలతోనే ముడి పదార్థాల అభివృద్ధి సాంకేతికతపై కృషి చేసి విజయం సాధించింది.