నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయంలో గతనెల 26న కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి అంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురవ్వడం వల్ల పాఠశాలలో కలరా కీడు సోకిందని వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. తమ పిల్లల్ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లారు.
భయపడి వెళ్లిపోయారు
పాఠశాల పునఃప్రారంభ సమయంలో కాస్త ఆలస్యమైతే ప్రవేశం కూడా దొరకని ఈ కస్తూర్భా విద్యాలయం నేడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. కలుషిత ఆహారం సేవించిన విద్యార్థుల ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడం వల్ల తోటి చిన్నారులు భయపడి ఇంటిబాట పట్టారు. పాఠశాల ఎస్వో, వంటావార్పు చేసే నలుగుర్ని విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు అక్కడ వంట చేసే వారు కూడా లేకపోవడమూ విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవడానికి ఓ కారణం.
భరోసా ఇవ్వండి
కేవలం పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 200మంది విద్యార్థినుల చదువుకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. పాఠశాల ప్రారంభంలో విద్యార్థినులతో కళకళలాడిన విద్యాలయం నేడు నిర్మానుష్యంగా మారింది. ఇప్పటికైనా అధికారులు విద్యార్థినుల ఆరోగ్యంపై భరోసా కల్పించి వెళ్లిపోయిన వారిని తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం