నిర్లక్ష్యాలకు నిలయంగా మారుతున్నాయి కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు. వైద్య సిబ్బంది అలసత్వం సైతం రోగులు, గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి దూది కడుపులోనే వదిలేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.
పట్టణానికి చెందిన రేర్లకంటి జ్యోతి( 20),భర్త మణికంఠ(25)తో కలిసి ఈనెల 3న ప్రభుత్వ ఆస్పత్రిలోని మాత శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చారు. ప్రసవం అనంతరం ఆ మహిళకు శస్త్ర చికిత్స చేశారు. ప్రసవం కోసం వచ్చిన మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి దూదిని కడుపులోనే ఉంచారని బాధితులు ఆందోళన చేశారు. బాధితురాలికి మల విసర్జన కాకుండా కడుపు ఉబ్బినట్లు ఉండటం.. కడుపులో నొప్పి అనిపించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ తీయించారు. దీంతో కడుపులో దూది ఉన్నట్లు తెలిసింది.
దూది కడుపులోనే ఉంచి కుట్లు వేశారని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని ఆమె భర్త నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు నీకు దిక్కు ఉన్న చోటా చెప్పుకోమని చెప్పడంతో రాత్రి ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. శస్త్ర చికిత్స సమయంలో కుట్లు వేసినప్పుడు పైభాగాన అలానే ఉంచుతారని సూపరింటెండెంట్ తల తిక్కలేని సమాధానం చెప్పారని బాధితులు తెలిపారు. సీఎంకు చెప్పుకుంటారా.. చెప్పుకోండి అంటూ ఆయన వచ్చి చేస్తారా కాన్పులు అని డాక్టర్లు అన్నారని బాధితులు ఆరోపించారు.
ఇదే కాకుండా ఆసుపత్రిలో ప్రతి పనికి ఓ రేటు చొప్పున వసూళ్లు చేస్తున్నట్లు ..బాబు పుడితే రూ.1500 నుంచి రూ.2000, పాప పుడితే రూ.1000 నుంచి రూ.1500వరకు ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది వసూలు చేస్తున్నారని కొంతమంది మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రికి కాన్పు కోసం మా భార్యను తీసుకొచ్చాం. డెలివరీ అయింది కానీ.. ఆపరేషన్ చేసి కాటన్ పెట్టి మర్చిపోయారు. 3వ తేదీన డెలివరీ అయింది. 5వ తేదీన డిశ్చార్జి చేశారు. డాక్టర్ వచ్చి చూడలేదు. ఇంటికి రాస్తే వెళ్లినం. మొత్తం ఐదు రోజుల నుంచి మల విసర్జన లేదు. కడుపు మొత్తం ఉబ్బిపోయింది. ఇంకా రెండు రోజులు ఆలస్యం అయితే మా పరిస్థితి ఏంది?. ఇంత నిర్లక్ష్యమా?. -మణికంఠ, బాధిత మహిళ భర్త
ఇవీ చదవండి: