లాక్ డౌన్ సందర్భంగా మెదక్ జిల్లా వివిధ ఠాణాల పరిధిలోని 500 మంది నిరుపేదలకు 10 కేజీల బియ్యం, కిరాణా సామగ్రిని అదనపు ఎస్పీ నాగరాజు పంపిణీ చేశారు. కొంత మంది యువకులు అకారణంగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారని... డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. లేదంటే వారిని ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచుతామని అన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, మీడియా మాస్క్ ధరించాలని సూచిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని డీఎస్పీ కృష్ణమూర్తి మండిపడ్డారు. బయటకు వచ్చేటప్పుడు చాలా మంది మాస్కులు ధరించట్లేదని... ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని కోరారు. కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో రోడ్లపైన ఎవ్వరూ ఉమ్మి వేయకూడదన్నారు. కార్యక్రమంలో మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, మున్సిపల్ ఛైర్మన్ చంద్ర పాల్, కమిషనర్ శ్రీహరి, వర్తక వ్యాపార సంస్థల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.