సొంతూరు జోగినపల్లిలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి జాతరకు వెళ్లి మొక్కులు తీర్చుకుందామని కుటుంబసభ్యులు నలుగురు జగిత్యాల నుంచి బయల్దేరారు. మేడిపల్లి కంట్లకుంట వద్దకు రాగానే... కారు నడుపుతున్న అమరేందర్రావు నిద్రమత్తులో కారును మట్టిరోడ్డుకు తిప్పాడు. ఆయన తేరుకునే సరికే ఘోరం జరిగిపోయింది. కారు అదుపుతప్పి కాల్వలో పడిపోయింది.
కుమారుడు సురక్షితం...
కారు నుంచి జయంత్ సురక్షితంగా బయటపడగా... మిగతా ముగ్గురు మాత్రం కారులోనే చిక్కుకున్నారు. కాల్వలో నీటి ప్రవాహ వేగానికి కారు కొంత దూరం కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టేలోపే కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు.
ఎమ్మెల్యే దగ్గరి బంధువులు...
మృతులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్కు దగ్గరి బంధువులవుతారు. ప్రమాద విషయం తెలుసుకోగానే... ఎమ్మెల్యే హుటాహుటినా ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. దగ్గరి బంధువులను కోల్పోవడం బాధగా ఉందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో పాటు కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇటీవలే నిశ్చితార్థం...
కుమార్తె శ్రేయకు ఇటీవలే పెళ్లి ఖాయమైంది. మే 23న పెళ్లి జరగాల్సి ఉండగా ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మృతిచెందిన అమరేందర్రావు గతంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వర్తించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ తండ్రి అయిన న్యాయవాది హనుమంతరావు వద్ద జూనియర్గా పనిచేశారు.
ఇదీ చూడండి: 'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'