రైతన్నల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి ప్రారంభించారు.
అన్నదాతలని ఆదుకునేందుకు కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొప్పుల తెలిపారు. అందుకే రైతులు నష్టపోకుండా మక్కలు కొనుగోలు చేస్తూ మద్దతు ధరను అందిస్తున్నారని వెల్లడించారు. గతంలో మొక్కజొన్నని సుమారు 12 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారని గుర్తు చేశారు. సీఎం సూచనల మేరకు మక్క పంట సాగు తగ్గించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
పసుపు పంటలో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసిన వారి పంటలను కొనుగోలు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు.
కొందరు రైతులను నాయకులు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: 'ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వినియోగదారులకు రాయితీలు'