తెలుగు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదికల(డీపీఆర్)సమర్పణతోపాటు పలు అంశాలు కేంద్రం ముందుకు రానున్నాయి. ఇవాళ దిల్లీ కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్రాలకు వర్తమానం అందింది. సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయం తరలింపు, నదీ జలాల సరిహద్దులపై తీసుకోవాల్సిన నిర్ణయం వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.
ఈరోజు హైదరాబాద్లో నిర్వహించనున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధానమైన 4 అంశాలతోపాటు కొత్తగా రెండు అంశాలను లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చెన్నై తాగునీటి విడుదల అంశాన్ని కూడా బోర్డు పరిధిలోకి చేర్చాలని తెలంగాణ, వరదల సమయంలో వినియోగించుకుంటున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఏపీ బోర్డు ఛైర్మన్ అనుమతితో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితోపాటు అజెండాలో చేర్చిన కేఆర్ఎంబీకి నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ, 10వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తీర్మానం, బోర్డును ఏపీ రాజధానికి తరలింపు వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇదీ చూడండి : కరోనాపై ఆందోళన వద్దు.. మనోధైర్యమే మందు