నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రామిరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 13వేల మందికి పైగా డెవలపర్ల వద్ద పని చేస్తున్న రెండున్నర కోట్ల మంది కార్మికులకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వినతి పత్రం ఇచ్చామని... త్వరలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
మరో వైపు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు బిల్డర్లంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని రంగాలకు ఆధారమైన నిర్మాణ రంగం కుంటుపడకుండా ఉండాలని తాము ఆశిస్తున్నామని వెల్లడించారు. కీలకమైన కార్మిక వర్గాన్ని అన్ని విధాలా ఆదుకుని ఇబ్బందులు లేకుండా చూసుకునే దిశలోనే క్రెడెయ్ పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: 'కరోనా చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారు'