ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్లో జరిగిన యువతి అత్యాచారం, హత్యా ఘటన దేశాన్ని కలచివేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శాంతి యుతంగా, సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిరసగా హైదరాబాద్లోని గాంధీ భవన్ గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
యువతిపై సామూహిక అత్యాచారం చేసి, నాలుక కోసేసి, వెన్నుముక విరిచి దారుణంగా హత్య చేశారని.. ఇంతటి ఘోరం జరిగితే భాజపా పాలిత రాష్ట్రంలో పాలకులు ప్రదర్శించిన తీరు సభ్య సమాజం తలదించుకేనేలా ఉందని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. స్వతంత్ర దేశంలో ఒక యువతి స్వేచ్ఛగా, ధైర్యంగా తిరగలేని దుస్థితిని చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడం బాధకలిగిస్తోందన్నారు.
హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను ఇంట్లో నిర్బంధించి ఆమె మృతదేహాన్ని పోలీసులు దహనం చేయడం దుర్మార్గ చర్యగా ఉత్తమ్ అభివర్ణించారు. హిందూ సంప్రదాయాలకు బ్రాండ్ అంబాసిడర్ల మాదిరి భుజాలు చరుచుకునే భాజపా నేతలు ఒక పెళ్లికాని యువతిని ఎలా దహనం చేస్తారన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. రాత్రి సమయంలో అంతిమ కార్యక్రమాలు చేయొద్దని సంప్రదాయాలు ఉన్నా.. ఎందుకు చేశారని నిలదీశారు.
సాక్ష్యాలు పూర్తిగా కాల్చేసిన తరువాత కేసును సీబీఐకి ఇచ్చినా ప్రయోజనం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేతలు హాథ్రస్కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ప్రయత్నిస్తే వాళ్లను అరెస్టు చేయడం దారుణమన్నారు. అగ్రనేతల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం, రాహుల్ గాంధీని కింద పడేయడం, ప్రియాంక గాంధీని మగ పోలీసులతో నిలువరించే యత్నం చేయడం లాంటివి.. బ్రిటిష్ పాలకులకంటే అధ్వాన్నంగా భాజపా పాలకుల తీరు ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బాలికల పరిస్థితి కూడా ఆలాగే ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలి: ఉత్తమ్