జిల్లాస్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు.. ప్రభుత్వ వైద్య సిబ్బంది నియామకాలు, బదిలీలు, ఒప్పంద వైద్యులకు వేతనాల చెల్లింపులు.. ఇలా ఏ పని జరగాలన్నా పలు జిల్లాల్లో వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయానికి ముడుపులు ముట్టాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కొందరు డీఎంహెచ్ఓలు, ఉప వైద్యాధికారులపై విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో చేపట్టిన స్టాఫ్నర్సుల నియామకాల్లో అర్హులకు కాదని, డబ్బులు తీసుకొని తమకు నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి అక్రమాల్లో ఆయా అధికారుల చేతికి మట్టి అంటకుండా వారి వ్యక్తిగత సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు.మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు ముడుపులిస్తే ఎలాంటి తనిఖీలు జరపకుండానే అనుమతులిస్తున్నారని, ఎలాంటి తప్పులున్నా కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, అర్హత లేకపోయినా చికిత్సలు అందించడం వంటివి వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో తాత్కాలికంగా చర్యలు తీసుకొని.. మళ్లీ వారికి అనుమతులిచ్చారు. దీని వెనుక ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఈ నెల 23 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అర్హత లేని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది.. అవసరమైన వైద్య సిబ్బంది లేకపోవడం.. అనుమతులు తీసుకోకపోవడం.. నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పించకపోవడం.. పారిశుద్ధ్యం తదితర అన్ని కోణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలిచ్చినా ఇప్పటివరకూ 15 జిల్లాల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
21 ఆసుపత్రుల మూసివేత
మిగతా 18 జిల్లాల్లో గత 5 రోజుల్లో వైద్య బృందాలు 311 ఆసుపత్రులను తనిఖీ చేశాయి. ఇందులో 21 ఆసుపత్రులను మూసివేయగా.. 83 దవాఖానాలకు తాఖీదులు అందించారు. మరో ఏడింటికి జరిమానాతో సరిపెట్టారు.
* రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 67 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఏడింటిని మూసివేయగా.. 20 దవాఖానాలకు తాఖీదులు, ఒక దానికి జరిమానా విధించారు.
* హైదరాబాద్లో ఇప్పటివరకూ 17 ఆసుపత్రులనే తనిఖీ చేశారు. ఇక్కడ 9 దవాఖానాలకు తాఖీదులు, ఒక ఆసుపత్రికి జరిమానా విధించారు.
* వికారాబాద్లో 44 ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి, అయిదింటిని మూసివేశారు. మరో 2 ఆసుపత్రులకు తాఖీదులు, అయిదింటికి జరిమానా విధించారు.
* కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4, మంచిర్యాలలో 14, మేడ్చల్ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్లో 7, వరంగల్లో 3 ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఈ జిల్లాల్లో ఒక్క దానిపైనా చర్య తీసుకోలేదు.
ఇప్పటికీ లోపాయికారి ఒప్పందాలు!
ప్రైవేటు వైద్య కేంద్రాల్లో లోపాలపై స్వయంగా ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకూ జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసిన దాఖలాలులేవు. దీనినిబట్టి అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఇప్పటికీ లోపాయికారిగా కొన్ని ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
* కొందరు డీఎంహెచ్ఓలు పెద్దఎత్తున పైరవీలు చేసుకొని.. ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పోస్టింగ్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పోస్టింగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో డీఎంహెచ్ఓల వ్యవహారాలపై నిశితంగా దృష్టిసారించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి:
ఆ పోస్టుల అర్హత గురించి.. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి హరీశ్రావు లేఖ
'బతుకమ్మ'కు ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధం.. షేర్ చేసిన ప్రియాంక