అధ్యాపకులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించకుండా రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిగ్రీ అతిథి అధ్యాపకులను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేశ్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్లోని సర్వశిక్షా అభియాన్ భవన్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆన్లైన్ తరగతులు సెప్టెంబర్లో ప్రారంభమైన్నప్పటికీ... ఇంత వరకు డిగ్రీ అతిథి అధ్యాపకులకు రెన్యూవల్ ఆర్డర్ ఇవ్వకపోవడం దారుణమని కృష్ణయ్య విమర్శించారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ కళాశాల్లో అధ్యాపకులకు వేతనాలు ఇవ్వకుండా... విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అతిథి అధ్యాపకులకు 10నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్క రాష్ట్రాల్లోని కళాశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు... అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారని పేర్కొన్నారు. 6,7 వేల పోస్టులను భర్తీ చేయడం కాదని... వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే... దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరుద్యోగులు ఎలా కన్నెర్రజేశారో భవిష్యత్తులోనూ తెరాసకు అవే పరిణామాలు ఎదురవుతాయని కృష్ణయ్య హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు ప్రకటించిన బోర్డు