సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి తన నివాసంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు. పలు రకాల వంటలతో అల్పాహారం సిద్ధం చేశారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. జస్టిస్ రమణను ఘనంగా సన్మానించారు. ఈ విందులో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గోస్వామి, అక్కడి న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ లలిత తదితరులు పాల్గొన్నారు. సుప్రీం మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జీవన్రెడ్డి, జస్టిస్ ఖాద్రి, జస్టిస్ సుదర్శన్రెడ్డి, జస్టిస్ పి.వెంకట్రామిరెడ్డి, జస్టిస్ జగన్నాథరావులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. జస్టిస్ రమణ... న్యాయమూర్తుల కుటుంబాలతో రెండు గంటలకుపైగా ఆత్మీయంగా గడిపారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం జ్యుడిషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తులు అందరూ సంతకాలు చేసిన సుప్రీంకోర్టు, సీజేఐ చిత్రంతో కూడిన పోస్టర్ను జస్టిస్ రమణకు బహూకరించారు.

న్యాయ కళాశాలల్లో సీట్లపై ఆరా
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్దన్రెడ్డిలు జస్టిస్ రమణను కలిసి హైదరాబాద్లో లా అకాడమీ స్థాపనకు సహకరించాలని కోరారు. సీజేఐ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాలల గురించి ఆయన ఆరా తీశారు. బీసీఐ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లి ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్ల పెంపునకు కృషి చేయాలని సూచించారు. జస్టిస్ రమణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు వరంగల్ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిందని, ప్రారంభానికి విచ్చేయాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ వరంగల్ బార్ తరఫున అభ్యర్థించగా కొవిడ్ ముగిశాక వెళ్దామని జస్టిస్ రమణ తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సూర్యకరణ్రెడ్డి నేతృత్వంలో సభ్యులందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

ఉత్తమ్ శుభాకాంక్షలు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి జస్టిస్ రమణను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు కూడా కలిశారు.
ఎర్రబెల్లి, కడియంల భేటీ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జస్టిస్ రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మీ నేతృత్వంలో భారత న్యాయ వ్యవస్థలో తప్పక మంచి మార్పులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
కొత్త అతిథి గృహంలో బసకు ఏర్పాట్లు
రెండు మూడు రోజుల్లో జస్టిస్ రమణ యాదాద్రిలో పర్యటించనున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్లు ఆయన వెంట వెళ్తారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి జగదీశ్రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్రెడ్డి యాదాద్రి బయల్దేరి వెళ్లారు. కొండపై కొత్తగా నిర్మించిన అతిథి గృహంలో ప్రధాన న్యాయమూర్తి బస కోసం వసతులు కల్పించాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీజేఐ శ్రీశైలం కూడా వెళ్లనున్నారు.



ఇదీ చూడండి: రెండోరోజు బిజీబిజీగా గడిపిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ