కరోనాతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రజలకు ఆదాయం తగ్గింది. దేశవ్యాప్తంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలతోపాటు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ఆశించిన స్థాయిలో రాబడులు రాక ఇబ్బంది పడుతున్నాయి. ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిందన్న భావనతో ఉన్న ఈ తరుణంలో తెలంగాణలో మద్యం ప్రియులు తాగుడుకు భారీగా ఖర్చు చేశారు. ఒక్క జులై నెలలోనే ఏకంగా రూ.2,507 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.
అదనంగా ఆరు వందల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు
గత ఏడాది ఇదే నెలలో జరిగిన మద్యం అమ్మకాలతో పోలిస్తే ఆరు వందల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు అదనంగా జరిగాయి. హైదరాబాద్లో మాత్రం బీర్లు విక్రయాలు భారీగా తగ్గినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో జన్మదిన, వివాహ, ఇతరత్ర వేడుకలకు మద్యం తాగుతారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విందులు పూర్తిగా లేకుండా పోయాయి. మరో వైపు ఐటీ రంగానికి కేంద్ర బిందువైన హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వటంతో ఉద్యోగులు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అందుకే బీర్ల అమ్మకాలు పడిపోయాయని అంచనా వేస్తున్నారు.
సగానికి పడిపోయిన బీర్ల అమ్మకాలు
గత ఏడాది జులై నెలలో 31.48 లక్షల కేసులు లిక్కర్, 41.70 లక్షల కేసులు బీరు అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది జులై నెలలో 31.34 లక్షల కేసులు లిక్కర్, 22.99 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. లిక్కర్ అమ్మకాల్లో స్వల్పంగా తగ్గినా... బీర్ల అమ్మకాలు మాత్రం సగానికి పడిపోయాయి. అయినా మద్యం అమ్మకాల విలువ తగ్గకపోగా ఆరు వందల కోట్లు పెరిగింది.
సరిహద్దు జిల్లాల్లో పెరిగిన అమ్మకాలు
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగటంతో... తెలంగాణ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున మద్యం రవాణా జరుగుతోంది. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తరచూ దాడులు నిర్వహించి పట్టుకుంటున్నా... అక్రమ రవాణా ఆగడం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది జూన్లో 190 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. జులైలో 203 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో జూన్లో 198 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా జులైలో 210 కోట్ల రూపాయలు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
మద్యం దుకాణాల వేళలు పెంపు
నల్గొండ జిల్లాలో జూన్ నెలలో 274 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. జులై నెలలో 295 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ప్రతి జిల్లాలోనూ పది నుంచి 15 కోట్లు విలువైన మద్యం అదనంగా విక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు పూర్తిగా సడలించి.. మద్యం దుకాణాల వేళలు ముందున్నట్లుగా జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు సమయాలను పెంచడం వల్ల ఈ నెల నుంచి విక్రయాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య