జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 5.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియాన్ని ఎంపిక చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ నిర్వహించటంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని.. ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల నిర్వహణకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలాను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. నామినేషన్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో స్వీకరిస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 సంవత్సరాలు నిండినవారు, కొవిడ్ పాజిటివ్ వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి.. ఓట్లను వేయిస్తారని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా'