స్థానిక సమరానికి సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే స్థానిక సంస్థల పోరు ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి సన్నద్ధతను సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. పంచాయతీల వారీగా ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈసీ అందించింది. ఈ నెల 8వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పుస్తకాల ముద్రణ తుది దశకు చేరింది. ఈ నెల 15వ తేదీ నాటికి అవన్నీ పూర్తి కానున్నాయి.
ఈ నెల 9వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోపే రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ సిబ్బందిని గుర్తించి నియామక ఉత్తర్వులు అందించాలని ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, ప్రతి మండలంలోనూ మూడు కౌంటింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఈ నెల మూడో వారంలో షెడ్యూలు విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మే నెలలో రెండు లేదా మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాతే చేపట్టనున్నారు.
ఇదీ చదవండి:సారు.. కారు.. పదహారు.. సొంత జిల్లాకు కేసీఆర్