హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఎన్జే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రూ.40 వేల ఖర్చుతో ఎన్ 95 మాస్కులు, శానిటైజర్స్, గ్లౌస్లను తెలంగాణ డాక్టర్స్ ఫోరం పంపిణీ చేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి వైద్య సిబ్బందికి సాయం చేయాలని వైద్యుడు రాజ్ కుమార్ కోరారు.
ప్రతి ఒక్కరూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించాలని కోరారు. కరోనా మహామ్మారిని జయించటానికి వ్యక్తిగత దూరం తప్పక పాటించాలని సూచించారు. వైద్యులకు, పోలీసులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి క్యాన్సర్ వ్యాధి సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డా. జయలలిత, ఫోరం రాష్ట్ర కో-ఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.