ఆ క్షణం..గాల్లో ప్రాణం... ఇది ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల వద్ద వైద్యుల నోట వినిపించే మాట. ఇక్కడ ఆ కొద్ది నిమిషాల విలువ ఓ నిండు ప్రాణం. ఆ విలువ తెలిసిన అంబులెన్సుల డ్రైవర్లు క్షతగాత్రుల్ని, రోగుల్ని సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నగర దారులపై పెరుగుతున్న రద్దీ ఆ వేగానికి బ్రేకులేస్తోంది. అంబులెన్సు చక్రం కదలకుండా ఓవైపు ఇబ్బందులు ఎదురవుతుంటే.. రోడ్లపై ఎక్కడికక్కడ మూసేసిన యూటర్న్లు, మరమ్మతు పనులు మరోవైపు నరకం చూపిస్తున్నాయి. వెరసి నిమిషాల్లో చేరాల్సిన గమ్యానికి గంటలు పట్టేలా చేస్తున్నాయి. ఆసుపత్రికి చేరేలోపే బాధితుల పరిస్థితి విషమంగా మారుతుండగా.. కొన్నిసార్లు ప్రాణాలు పోతున్న ఘటనలూ ఉంటున్నాయి.
దారి లేకుండా చేస్తున్నారు!
నగరంలో ప్రధాన ఆసుపత్రుల వద్ద అంబులెన్సు లోపలికి చేరాలన్నా నరకమే. ఎక్కడికక్కడ యూటర్న్లు మూసేసి, బారికేడ్లు పెట్టి ఉస్మానియా, నిమ్స్లాంటి పెద్దాసుపత్రులకు దారి లేకుండా చేస్తున్నారు. పాతబస్తీలో మరీ ఘోరం. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన రహదారులపై అంబులెన్సుల కోసం ప్రత్యేక దారి కేటాయించేందుకు నాలుగేళ్ల క్రితం ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. ఆ నిర్ణయం క్షేత్రస్థాయిలో సాధ్యం కాకపోవడంతో అటకెక్కింది. ఆ తర్వాత అంబులెన్సులకు దారివ్వని వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. కొన్ని జిల్లాల్లో అమలవుతోంది. నగరంలో చర్యలు శూన్యం. ప్రస్తుతానికి సిగ్నళ్ల వద్ద కానిస్టేబుళ్లే దారిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘పాతబస్తీలో అంబులెన్సు కోసం ఫోన్ వస్తే భయమేస్తోంది. వాహనం వెళ్లేందుకు దారి ఉండదు. వెళ్లడంలో, బాధితుల్ని ఆసుపత్రికి చేర్చడంలో ఏమాత్రం జాప్యం చేసినా.. ఏదైనా జరగరానిది జరిగితే వారి తరఫు బంధువులు అద్దాలు పగలగొట్టడం, మాపై దాడి చేసిన ఘటనలున్నాయి’’ - భరత్, అంబులెన్సు నిర్వాహకుడు
ప్రాణాలంటే విలువ లేదా..?
1 .‘‘సారీ.. ఐదు నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్లం..’’
2. మాసాబ్ట్యాంకు వంతెన వద్ద శనివారం సాయంత్రం 20 నిమిషాల పాటు ప్రొటోకాల్ పేరిట వాహనాల్ని నిలిపేయడంతో ఓ అంబులెన్సు చిక్కుకుంది. రోగి ప్రాణాల మీదికి రావడంతో వైద్యులే వచ్చి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనదారులూ గొంతు కలపడంతో తాత్కాలికంగా వాహనాల్ని వదిలారు.