అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను ధ్వంసం చేయడం, చెట్లను నరికేయడం వల్ల మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పర్యావరణశాఖ ఇంద్రకరణ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మానవజాతి వల్ల విశ్వం అంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతోందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై ఇప్పుడు ఉన్న చట్టాలు మాత్రమే సరిపోవని... ప్రజలంతా ఒక్కటై కదలాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ ప్రకృతి పరిరక్షణపై మాట్లాడారు.
కరోనా విపత్తు మానవాళికి నేర్పిన గుణపాఠమన్న ఇంద్రకరణ్ రెడ్డి... భావితరాల కోసం ప్రకృతి వనరుల పరిరక్షణ దిశగా కార్యాచరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా