* సంగారెడ్డి జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడి తండ్రి కరోనాతో చనిపోయారు. రెండేళ్ల క్రితమే తల్లి చనిపోగా ఇప్పుడు తండ్రి మృతితో బాలుడు ఒంటరివాడు అయ్యాడు. ఈ సమాచారం అందుకున్న శిశు సంక్షేమశాఖ ఆ బాలుడిని కలిసి కౌన్సెలింగ్ ఇచ్చి బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. బాలుడు చదువుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
* సూర్యాపేటలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయారు. ఆయనకు భార్య, మూడేళ్ల బాలుడు ఉన్నారు. భార్య గర్భిణి కావడంతో.. ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కాల్సెంటర్కు సమాచారం వచ్చింది. అంగన్వాడీ టీచర్, జిల్లా సంరక్షణ కమిటీ.. వారిని కలిసి రెండు నెలలకు సరిపడ సరకులు అందించింది. భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు శిశు సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది.
* ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి పిల్లలకు కరోనా పరీక్షలు చేయించాలని ఫోన్ రాగా, శిశు సంక్షేమాధికారులు స్థానిక వైద్యాధికారిని సంప్రదించి పరీక్షలు పూర్తి చేశారు.
ఇందుకోసం శిశు సంక్షేమశాఖ ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కాల్ వచ్చిన వెంటనే స్థానిక అంగన్వాడీ టీచర్ సహాయంతో వివరాలు సేకరించి జిల్లా బాలల సంరక్షణ అధికారి (సీడీపీవో), సీడబ్ల్యూసీ, డీసీపీయూ యూనిట్ల ద్వారా అవసరమైన సహాయం అందిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కరోనాతో భార్యాభర్తలు చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలిసిన శిశు సంక్షేమ అధికారులు అక్కడికి వెళ్లి వివరాలు తీసుకున్నారు. పిల్లలకు మంచి చదువు చెప్పించేలా గురుకులాల్లో సీటు కావాలని, మిగతా బాధ్యతలు తాము చూసుకుంటామని పిల్లల బంధువులు చెప్పారని, ఆ మేరకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అసహాయ చిన్నారుల సంరక్షణ, సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నం:040-23733665 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) ఛైల్డ్ హెల్ప్లైన్ నం: 1098 (24 గంటలు)
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అసహాయ చిన్నారుల సంరక్షణకు పునరావాస కేంద్రాలను గుర్తించాం. కరోనాతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేరితే, వివరాలను సహాయ కేంద్రానికి తెలియజేయాలి. వారి పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చూస్తుంది.
- స్త్రీశిశు సంక్షేమశాఖ
ఇలా ప్రారంభం..
బాలల సంరక్షణ కేంద్రా(సీసీఐ)ల్లో ఆశ్రయం పొందుతున్న అసహాయ పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినప్పుడు వారి పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు శిశు సంక్షేమశాఖ ఇటీవల ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే కరోనా రెండో దశలో ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు చనిపోతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల్ని సంరక్షించాలన్న ఉద్దేశంతో సహాయ కేంద్రం సేవల్ని విస్తరించింది.
శిశువిహార్లో తాత్కాలిక పునరావాస కేంద్రం
కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాల్లో పిల్లల సంరక్షణ, తాత్కాలిక పునరావాసం కోసం హైదరాబాద్ శిశువిహార్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆశాఖ కార్యదర్శి దివ్యతో కలిసి గురువారం ఈ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాల్లోనూ ఆసరా, సహాయం కోసం ఎదురుచూస్తున్న పిల్లలను అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో వైద్యం, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రకృతి వైద్యశాలలో 20 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆక్స్ఫర్డ్ టీకాతో రక్తం గడ్డకట్టే రేటులో పెరుగుదల'