భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని నవభారత్ ఏరియాకు చెందిన భూక్య జ్యోతి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిపై ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే కొడుకు రాఘవ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతిరాఠోడ్కు వినతి పత్రం అందించింది.
తక్షణమే స్పందించిన మంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్పీ మంత్రికి తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని, ఒక ఆడపిల్లపై ఇలాంటివి చేస్తే సహించేది లేదని... నిందితులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఎస్పీకి సూచించారు.
''దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా సంతోషంగా ఉండాలనే... వారికి రక్షణ కల్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినమైన పోలీసు వ్యవస్థను తీసుకొచ్చారు. దోషులెవరైనా కచ్చితంగా శిక్ష పడుతుంది. ఎస్పీతో మాట్లాడాను. కచ్చితంగా బాధితురాలికి న్యాయం చేస్తాను.''
-మంత్రి సత్యవతి రాఠోడ్
ఇవీ చూడండి: నిరంతర విద్యుత్తుపై ఉరుములు